Hyderabad Metro: ఆర్టీసీ సమ్మె ప్రభావంతో బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని అద్దె బస్సులు నడుస్తున్నప్పటికీ అవి సరిపోక, ఉద్యోగాలు, వ్యాపారాలకు వెళ్లే ప్రజలకు ఇబ్బందులు పెరిగాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ మెట్రో రైలు కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రజల అసౌకర్యాన్ని తగ్గించేందుకు మెట్రో సర్వీసుల సంఖ్యను పెంచాలని నిర్ణయించినట్లు హెచ్ఎంఆర్ఎల్ ఎండీ తెలిపారు. ఇందుకు సంబంధించి హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ఎల్డీఎంఆర్ హెచ్ఎల్తో చర్చలు జరిపింది. సమ్మె సమయంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రోజంతా గరిష్ట స్థాయిలో రైళ్లు నడపాలని నిర్ణయించారు.
సాధారణంగా పీక్ అవర్స్లో, అంటే ఉదయం 8.00 నుండి 10.30 వరకు, సాయంత్రం 5.00 నుండి 8.00 వరకు 56 రైళ్లు నడుస్తాయి. ఈ సమయంలో రెండు రైళ్ల మధ్య గ్యాప్ సుమారు 3 నిమిషాలు 40 సెకన్లు ఉంటుంది. నాన్-పీక్ అవర్స్లో మాత్రం రైళ్ల సంఖ్య 44కి తగ్గుతుంది. మియాపూర్ – ఎల్బీ నగర్ (C1) మార్గంలో 4 నిమిషాలు 50 సెకన్లు, నాగోల్ – రాయదుర్గ్ (C3) మార్గంలో 5 నిమిషాలు 20 సెకన్ల గ్యాప్తో రైళ్లు నడుస్తాయి.
కానీ ప్రస్తుతం ఆర్టీసీ సమ్మె కారణంగా, రోజంతా 56 రైళ్లు నడపాలని నిర్ణయించారు. మియాపూర్ – ఎల్బీ నగర్ మార్గంలో ప్రతి 4 నిమిషాలు 20 సెకన్లకు ఒక రైలు, నాగోల్ – రాయదుర్గ్ మార్గంలో ప్రతి 3 నిమిషాలు 40 సెకన్లకు ఒక రైలు నడిచేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
అదనంగా, ప్రయాణికులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు రాత్రి 11.00 గంటల తర్వాత కూడా చివరి మెట్రో సర్వీస్ సమయాన్ని పొడిగించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Also Read: Pahalgam Attack: దారుణం.. రూ.3వేలకు కక్కుర్తి.. 26 మంది ప్రాణాలు బలి
Hyderabad Metro: గుడ్ న్యూస్.. ఇకనుంచి 4 నిమిషాలకో మెట్రో
