Kavitha: తెలంగాణలో కొత్త పార్టీ ఆవిర్భావ సభలో కల్వకుంట్ల కవిత తన రాజకీయ వైఖరిలో కొత్త మార్పు చూపించారు. ఇప్పటివరకు ప్రజల్లో “కవితక్క”గా గుర్తింపు పొందిన ఆమె, ఇప్పుడు తనను “అమ్మ”గా ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలోని మూడు కోట్ల ప్రజలకు తాను అమ్మలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
ఈ నేపథ్యంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితతో పోలికలు వస్తున్నాయి. ద్రవిడ రాజకీయాల్లో పురుషాధిక్యాన్ని ఎదుర్కొని జయలలిత “అమ్మ”గా బలమైన నాయకురాలిగా ఎదిగారు. అదే తరహాలో కవిత కూడా రాజకీయాల్లో కొత్త మార్గాన్ని సృష్టిస్తారా అనే చర్చ మొదలైంది.
కేసీఆర్ కుమార్తెగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా ఉన్న కవితకు ఇప్పటివరకు “అక్క” అనే భావం బలంగా ఉంది. కానీ కొత్త పార్టీ ప్రకటించిన తర్వాత ఆమె తన ఇమేజ్ను మార్చుకుని “అమ్మ”గా ప్రజలకు చేరువ కావాలనే ప్రయత్నం చేస్తున్నారు.
సభలో మాట్లాడుతూ నిరుద్యోగులకు తాను అమ్మలా అండగా ఉంటానని తెలిపారు. ప్రతి విద్యార్థికి ఉచిత విద్య అందిస్తానని హామీ ఇచ్చారు. “అమ్మ జేబు చూడదు.. కడుపు చూస్తుంది” అంటూ ప్రైవేట్ స్కూల్లలో చదివే విద్యార్థులకు కూడా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత విద్య కల్పిస్తామని చెప్పారు.
అంతేకాదు, తెలంగాణలో పిల్లలు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు ఉచిత వైద్యం అందించే బాధ్యత తీసుకుంటానని ప్రకటించారు. “ఈ హామీలు మీ తల్లి ప్రభుత్వంలో, మీ అమ్మ ప్రభుత్వంలో అమలు అవుతాయి” అని కవిత స్పష్టం చేశారు.
