Viral: అత్తా-కోడళ్ల మధ్య విభేదాలు, గొడవల కథలే ఎక్కువగా వినిపించే ఈ రోజుల్లో రాజస్థాన్లోని బ్రజ్భూమి నుంచి వెలుగులోకి వచ్చిన ఓ ఘటన అందరినీ భావోద్వేగానికి గురి చేస్తోంది. హర్యానాకు చెందిన ఓ కోడలు తన 90 ఏళ్ల అత్తగారి కోరికను నెరవేర్చేందుకు అసాధారణమైన త్యాగం చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది.
హర్యానాలోని హతానా గ్రామానికి చెందిన కాజల్ చౌదరి ప్రముఖ హర్యానవీ జానపద గాయని. ఆమె అత్త చంద్రి దేవి వయసు 90 సంవత్సరాలు. వృద్ధాప్యం కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా ఆమె స్వయంగా నడవలేని స్థితిలో ఉన్నారు. అయితే బ్రజ్భూమిలోని ప్రసిద్ధ 84 కోసుల పరిక్రమ (ప్రదక్షిణ) పూర్తి చేయాలన్న కోరికను ఆమె ఎన్నో ఏళ్లుగా మనసులో పెట్టుకున్నారు.
అత్తగారి కోరిక గురించి తెలుసుకున్న కాజల్ చౌదరి, దాన్ని నెరవేర్చాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఆమె చంద్రి దేవిని ఒక పెద్ద ప్లాస్టిక్ తొట్టిలో కూర్చోబెట్టి, ఆ తొట్టిని తన తలపై మోస్తూ పరిక్రమ యాత్రను ప్రారంభించారు. బనచారి గ్రామం నుంచి మొదలైన ఈ కఠినమైన పాదయాత్ర ప్రస్తుతం భరత్పూర్ ప్రాంతంలో కొనసాగుతోంది.
ఈ యాత్రకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాజల్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆమె అంకితభావాన్ని చూసిన నెటిజన్లు, భక్తులు, స్థానికులు భావోద్వేగానికి గురవుతున్నారు. మార్గమధ్యలో అనేక ప్రాంతాల్లో ప్రజలు ఆమెకు పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలుకుతున్నారు.
ఈ సందర్భంగా కాజల్ చౌదరి మాట్లాడుతూ, “నా అత్తగారు గత కొన్నేళ్లుగా నడవలేకపోతున్నారు. అయినప్పటికీ బ్రజ్భూమి పరిక్రమ చేయాలన్న కోరిక ఆమెకు ఎప్పటి నుంచో ఉంది. నేను ఈ స్థాయికి రావడానికి ఆమె ఆశీర్వాదాలే కారణం. ఆమె నన్ను కోడలిగా కాకుండా సొంత కూతురిలా చూసుకున్నారు. ఇప్పుడు ఆమె కోరికను నెరవేర్చడం నా బాధ్యతగా భావిస్తున్నాను” అని తెలిపారు.
కాజల్ చూపిస్తున్న ప్రేమ, గౌరవం సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కుటుంబ బంధాలు బలహీనపడుతున్న ఈ కాలంలో, అత్తగారిని తల్లిలా భావించి ఆమె కోరిక కోసం ఇంతటి కష్టాన్ని భరిస్తున్న కాజల్ చౌదరి నిజంగా ఆదర్శంగా నిలిచారని స్థానికులు కొనియాడుతున్నారు.
ఇది కేవలం ఒక మతపరమైన యాత్ర మాత్రమే కాదు. కుటుంబ బంధాల విలువను, పెద్దల పట్ల గౌరవాన్ని, ప్రేమను గుర్తుచేసే స్ఫూర్తిదాయకమైన సంఘటనగా కూడా పలువురు భావిస్తున్నారు. కాజల్-చంద్రి దేవి మధ్య ఉన్న అనుబంధం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
