ఉపాధి రంగంలో యువతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు అందిస్తామని తెలిపారు. మొదటి ఏడాదిలోనే సింగిల్ నోటిఫికేషన్ ద్వారా 4 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, అలాగే ఉద్యమకారులకు లక్ష సూపర్ న్యూమరీ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సామాజిక న్యాయం సాధించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
ఇక పార్టీ పరిస్థితులపై కూడా కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉద్యమకారులను పార్టీ నుంచి బయటకు పంపిన రోజే తాను స్పందించాల్సిందని, కానీ అప్పుడు మాట్లాడలేదని అన్నారు. ఇప్పుడు తనకూ అదే పరిస్థితి ఎదురైందని తెలిపారు. ఉద్యమంలో బాధలు పడ్డ వారిని పక్కనబెట్టి, వారినే కొట్టినవారికి పదవులు ఇచ్చారని ఆరోపించారు. వారి అనుచరులు నిజమైన కార్యకర్తలను అణగదొక్కారని విమర్శించారు.
ఉద్యమకారులకు కనీసం నామినేటెడ్ పోస్టులు ఇచ్చినా సరిపోయేదని, కానీ అది కూడా చేయలేదని అన్నారు. అప్పట్లో కండువా వేసుకుని ఎంతో నిబద్ధతతో పనిచేశామని, కానీ ఇప్పుడు ఆ పార్టీలో మమకారం, అనుబంధం లేవని పేర్కొన్నారు. అందుకే కేసీఆర్ ఇప్పుడు మన కేసీఆర్ కాదని, మారిపోయారని విమర్శించారు.
కేసీఆర్ ఒకప్పుడు “నా పిల్లలు తప్పు చేసినా పార్టీ నుంచి తీసేస్తాను” అని చెప్పారని గుర్తుచేశారు. అయితే అవినీతి ఆరోపణలు ఉన్న తనను బయటకు పంపి, అవినీతి చేసిన వారిని మాత్రం దగ్గర పెట్టుకున్నారని అన్నారు. ఈ కారణంగానే ఆయన ఇప్పుడు మన కేసీఆర్ కాదని కవిత తీవ్రంగా వ్యాఖ్యానించారు.
