Kavitha: కవిత కొత్త పార్టీ ప్రకటనపై బీఆర్ఎస్ వ్యంగ్యంగా స్పందించింది. కవిత తన పార్టీకి “టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సేన)” అనే పేరు పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన బీఆర్ఎస్, “ఎంతైనా ఒరిజినల్ ఒరిజినలే” అంటూ సెటైర్ వేసింది. కవిత పార్టీ పేరు కాపీ చేసినట్టుగా సూచిస్తూ ట్వీట్ చేసింది. దీనికి తోడు ఒరిజినల్-డూప్లికేట్ కోల్గేట్, బిస్లెరీ ఫోటోలను షేర్ చేస్తూ వ్యంగ్యంగా స్పందించింది.
ఇక కవిత కూడా కేసీఆర్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. “కేసీఆర్ ఇప్పుడు మారిన మనిషి.. మన మనిషి కాదు, మర మనిషి” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ కష్టమొచ్చినా ఆయన ముందుకు రారని, గుంటనక్కల చేతిలో ఇరుక్కున్నారని విమర్శించారు.
“మన కేసీఆర్ అయితే పాలమూరు ప్రాజెక్టును పూర్తిచేసేవారు. కానీ ఇప్పుడు మారిపోయిన కేసీఆర్ పంజాబ్ వెళ్లి జాతీయ పార్టీ గురించి మాట్లాడుతున్నారు. సింగరేణిలో కార్మికుడు చనిపోతే వెళ్లి పరామర్శించే వ్యక్తి, ఇప్పుడు అలాంటి స్పందన చూపడం లేదు” అని అన్నారు. కేసీఆర్ రాజకీయ పరిపక్వత కోల్పోయారని కూడా విమర్శించారు.

కేటీఆర్ వ్యాఖ్యలపై మాట్లాడుతూ, “కేటీఆర్ మాట్లాడితే ఓకే అనుకోవచ్చు, ఆయనకు ఇంకా రాజకీయ అనుభవం తక్కువ” అని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో “కర్కోటకుడి పాలన” నడుస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఇళ్లు కూల్చుతున్నప్పుడు అమ్మలా నిలబడి ఆదుకోవాల్సిన కేసీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు.
తాను చాలా కాలం మార్పు కోసం ఎదురు చూశానని, కానీ చివరకు తనను సస్పెండ్ చేశారని చెప్పారు. “ఉద్యమకారులను పార్టీ నుంచి బయటకు పంపిన రోజే మాట్లాడాల్సింది, కానీ అప్పుడు మౌనంగా ఉన్నాను. ఇప్పుడు నాకు కూడా అదే పరిస్థితి వచ్చింది” అని పేర్కొన్నారు.
ఉద్యమంలో కష్టపడ్డ వారిని పక్కనబెట్టి, వారినే కొట్టినవారికి పదవులు ఇచ్చారని ఆరోపించారు. వారి అనుచరులు నిజమైన కార్యకర్తలను అణగదొక్కారని విమర్శించారు. కనీసం ఉద్యమకారులకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చినా సరిపోయేదని అన్నారు.
“ఆ సమయంలో కండువా వేసుకుని ఎంతో నిబద్ధతతో పనిచేశాం. కానీ ఇప్పుడు ఆ పార్టీలో మమకారం, అమ్మతనం కనిపించడం లేదు. అందుకే కేసీఆర్ ఇప్పుడు మన కేసీఆర్ కాదు, మారిపోయి మరబొమ్మలా మారిపోయారు” అంటూ కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
