Tandoor Case: ఉత్తర్ ప్రదేశ్లోని బస్తీ జిల్లాలో జరిగిన ఒక పెళ్లి వేడుకలో దారుణ ఘటన చోటుచేసుకుని విషాద వాతావరణం నెలకొంది. ఈ సంఘటన ఛావనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 15వ తేదీ రాత్రి జరిగింది.
చమన్ అలియాస్ అమర్ (11) అనే బాలుడు తన అమ్మమ్మతో కలిసి పెళ్లికి హాజరయ్యాడు. వేడుకలో అతను పదే పదే లోపలికి వెళ్లి రసగుల్లాలు తింటుండడంతో కేటరింగ్ గుత్తేదారు మొదట అతనిపై గట్టిగా అరిచాడు. అయితే బాలుడు మళ్లీ అక్కడికి రావడంతో ఆగ్రహానికి గురైన గుత్తేదారు, అతన్ని అమాంతం ఎత్తుకొని మండుతున్న తందూరీ పొయ్యిపై కూర్చోబెట్టాడు.
ఈ ఆకస్మిక ఘటనతో భయపడిపోయిన చమన్ పట్టుతప్పి నేరుగా పొయ్యిలో పడిపోయాడు. అతని కేకలు విని అక్కడున్నవారు వెంటనే స్పందించి, బాలుణ్ని బయటకు తీశారు. ఈ ఘటనలో అతనికి ముఖం నుండి నడుము వరకు తీవ్ర గాయాలు అయ్యాయి.
గాయపడిన చమన్ను వెంటనే లఖనవూ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేటరింగ్ గుత్తేదారిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం చమన్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని హరైయా సర్కిల్ అధికారి స్వర్ణిమా సింగ్ వెల్లడించారు.
Also Read: Shocker: ఏం దొంగలురా బాబు.. 20 నిమిషాల్లో బ్యాంకు ఖాళీ చేశారు
Tandoor Case: రసగుల్లాలు తింటున్నాడని.. తందూరీ పొయ్యిపై కూర్చోబెట్టాడు
