Singer Mangli: తెలుగు రాష్ట్రాల్లో తన పాటలతో మంచి గుర్తింపు పొందిన సింగర్ మంగ్లీపై తాజాగా కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. పెట్టుబడుల పేరుతో ప్రజలను మోసం చేశారనే ఆరోపణలతో పాటు, బాధితుల తరపున పోరాడుతున్న న్యాయవాదిని బెదిరించారన్న ఆరోపణలపై పంజాగుట్ట పోలీసులు చర్యలు చేపట్టారు.
పోలీసుల సమాచారం ప్రకారం, మంగ్లీ, ఆమె సోదరుడు శివతో పాటు మరికొందరు కలిసి సుమారు 100 మంది నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు సేకరించినట్లు తెలుస్తోంది. వ్యాపారంలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు ఇస్తామని చెప్పి ఈ డబ్బు తీసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే, గడువు దాటినా లాభాలు ఇవ్వకపోగా, అసలు డబ్బు కూడా తిరిగి ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో బాధితులు న్యాయం కోసం న్యాయవాది సుబ్బారావును సంప్రదించారు. ఈ వ్యవహారంపై ఆయన స్పందించి, డబ్బుల విషయమై మంగ్లీ బృందాన్ని నిలదీయగా వివాదం చెలరేగింది. ఈ క్రమంలో మంగ్లీ, ఆమె సోదరుడు శివ, దర్శకుడు వేణు ఉడుగుల తనకు ఫోన్ చేసి బెదిరించారని సుబ్బారావు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను రోడ్డు ప్రమాదంలా చూపించి చంపేస్తామని హెచ్చరించారని ఆయన తెలిపారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా పంజాగుట్ట పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టి, మంగ్లీ, శివ, వేణు ఉడుగుల తదితరులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని న్యాయవాది కోరడంతో పోలీసులు ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నారు.
ఇటీవల వరుస హిట్ పాటలతో కెరీర్లో ముందుకు సాగుతున్న మంగ్లీపై ఇలాంటి ఆరోపణలు రావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో పూర్తి స్థాయి దర్యాప్తు చేసి నిజానిజాలు వెలికితీస్తామని పోలీసులు తెలిపారు.
