Madhya Pradesh: మధ్యప్రదేశ్లో ఒక అరుదైన ఆధ్యాత్మిక కార్యక్రమం భక్తుల్ని ఆకట్టుకుంది. సెహోర్ జిల్లాలోని పాతాళేశ్వర్ మహాదేవ్ ఆలయంలో నర్మదా మాతకు 11,000 లీటర్ల పాలతో ఘనంగా మహాభిషేకం నిర్వహించారు. ప్రత్యేకంగా పాల ట్యాంకర్ను ఉపయోగించి చేసిన ఈ అభిషేకం భక్తి ప్రపత్తికి ప్రతీకగా నిలిచింది.
బెరుండ ప్రాంతంలోని సత్దేవ్లో ఉన్న ఈ ఆలయంలో 21 రోజుల పాటు మహాయజ్ఞం జరిగింది. మార్చి 18న ప్రారంభమైన ఈ యజ్ఞంలో ప్రతిరోజూ మహాహవనం నిర్వహించారు. రోజుకు సుమారు 21 క్వింటాళ్ల హోమ ద్రవ్యాలను ఉపయోగించగా, మొత్తం 21 రోజుల్లో దాదాపు 41 టన్నుల ద్రవ్యాలు వినియోగించారు. భక్తులు కొబ్బరికాయలతో పాటు బంగారం, వెండి వంటి కానుకలను కూడా హోమగుండంలో సమర్పించారు.
యజ్ఞం ముగింపు సందర్భంగా నర్మదా మాతకు ఈ ప్రత్యేక పాలాభిషేకం నిర్వహించారు. వేలాదిగా చేరుకున్న భక్తులు మంత్రోచ్చారణల మధ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాల ట్యాంకర్ నుంచి ప్రవహిస్తున్న పాలను చూసుకుంటూ భక్తులు పూజలు చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి.
ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉందని చెబుతారు. పూర్వం సప్తర్షులు ఇక్కడ తపస్సు చేశారని, వారి తపస్సుకు సంతోషించిన శివుడు పాతాళేశ్వర్ మహాదేవుడిగా ఇక్కడ వెలిశాడని స్థల పురాణం పేర్కొంటుంది. అహల్యాబాయి హోల్కర్ కాలంలో కూడా ఈ ఆలయానికి విశేష ప్రాధాన్యం లభించినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి.
సంత్ శివానంద్ మహరాజ్ మార్గదర్శకత్వంలో నిర్వహించిన ఈ మహాయజ్ఞం ముగింపులో వేలాది మంది భక్తులకు భండారా (అన్నప్రసాదం) ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం భక్తి, సంప్రదాయాల వైభవాన్ని మరోసారి చూపించింది.
🚨SHOCKING | People offer 11,000 litres of milk to the Narmada River
This milk would cost roughly ₹5.5 lakh to ₹7.7 lakh! pic.twitter.com/jFz5TTK3BH
— The Tatva (@thetatvaindia) April 9, 2026
