Telangana: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాలో హీరోయిన్ కు ఆమె తండ్రి హెచ్ఐవీ వైరస్ ఇంజక్షన్ ఇస్తాడు. ప్రేమించిన వాడిని మర్చిపోకపోవడంతో కూతురిని చంపేయాలని కన్నతండ్రే ఇలా చేస్తాడు. అదే తరహా ఘటన తాడాగా తెలంగాణలోని కామారెడ్డి జిల్లా పోచారంలో వెలుగులోకి వచ్చింది. పెళ్లికి నిరాకరించిన యువతిపై కోపంతో ఒక యువకుడు ఆమెకు ఎయిడ్స్ సోకిన రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
పోచారానికి చెందిన మనోహర్ అనే యువకుడితో ఒక యువతికి గతంలో వివాహం నిశ్చయమైంది. అయితే తరువాత మనోహర్కు ఎయిడ్స్ ఉందని యువతికి తెలిసింది. దీంతో ఆమె ఈ పెళ్లికి స్పష్టంగా నిరాకరించింది.
ఇదే విషయంపై ఆగ్రహించిన మనోహర్ ఈ నెల 11వ తేదీన యువతి ఇంటికి వెళ్లాడు. తనను తప్పకుండా పెళ్లి చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. కానీ యువతి మరోసారి పెళ్లికి అంగీకరించకపోవడంతో అతడు తీవ్ర చర్యకు దిగాడు.
పోలీసుల వివరాల ప్రకారం, మనోహర్ తన వద్ద ఉన్న ఎర్రటి ద్రవంతో కూడిన ఇంజెక్షన్ను యువతికి ఇచ్చాడు. అది ఎయిడ్స్ సోకిన రక్తమని అనుమానం వ్యక్తమవుతోంది. ఈ ఘటన తర్వాత బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.
ఇదిలా ఉండగా, మనోహర్తో పాటు అతని తల్లిదండ్రులకు కూడా గతంలోనే ఎయిడ్స్ ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మనోహర్ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ సంఘటన ప్రాంతంలో తీవ్ర ఆందోళనకు కారణమైంది.
