10th Class Result: తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ ఏడాది మార్చి 14న ప్రారంభమై ఏప్రిల్ 13న ముగిశాయి. ఆ తరువాత ఓరియంగల్ పరీక్షలు ఏప్రిల్ 15, 16 తేదీల్లో నిర్వహించారు. ఈ పరీక్షలకు సుమారు 5.17 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం నమోదు చేసుకున్న విద్యార్థుల సంఖ్య 5,28,239గా ఉంది.
పరీక్షల మూల్యాంకనం ప్రక్రియ ఇప్పటికే ఏప్రిల్ 1 నుంచే ప్రారంభమై, ఏప్రిల్ 23 నాటికి పూర్తికానుంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ చివరి దశలో ఉంది. అనంతరం మార్కుల నమోదు, ప్రాసెసింగ్కు మరో పది రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మే నెల మొదటి వారంలో ఫలితాలను ప్రకటించాలని అధికారులు యోచిస్తున్నారు. గత సంవత్సరం ఏప్రిల్ 30న ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈసారి కూడా అదే సమయానికి లేదా మే మొదటి వారంలో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది.
ఇక ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించారు. మొత్తం 6,40,916 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. అందులో 3,28,652 మంది బాలురు, 3,12,264 మంది బాలికలు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,415 పరీక్షా కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య పరీక్షలు నిర్వహించారు. సుమారు 99.05 శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు అధికారులు తెలిపారు.
ఏపీలో మూల్యాంకనం ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. ఏప్రిల్ 6 నుంచి 15 వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. ప్రస్తుతం మార్కుల ప్రాసెసింగ్ జరుగుతోంది. అక్కడ కూడా మే నెల మొదటి వారంలోనే పదో తరగతి ఫలితాలను ప్రకటించాలని విద్యాశాఖ భావిస్తోంది.
మొత్తం మీద, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పదో తరగతి ఫలితాలను మే నెల మొదటి వారంలో విడుదల చేయాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
