Shocking Incident: ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రిన్సిపాల్, చేతిలో ఒక పెద్ద కత్తి (Knife), మాంసం కోసే చాకు (Cleaver) పట్టుకుని రావడంతో అక్కడి విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర దిగ్భ్రాంతి(Shocking Incident)కి గురయ్యారు.
ఈ సంఘటన స్థానిక నివాసితుల దృష్టికి రావడంతో, వారు వెంటనే పోలీసులకు మరియు విద్యాశాఖకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే అధికారులు పాఠశాలకు చేరుకుని, ఆ ఆయుధాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
కత్తి, చాకుతో వచ్చిన ప్రిన్సిపాల్ను విచారించిన అధికారులు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రిన్సిపాల్ శిఖా సింగ్, పాఠశాల ప్రాంగణంలో కత్తి మరియు చాకుతో తిరుగుతూ కనిపించారని అధికారులు తెలిపారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసు బృందం, బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (BEO) నీరజ్ ఉమ్రావ్ పాఠశాలను సందర్శించారు. అధికారులు ఆ రెండు ఆయుధాలను తమ ఆధీనంలోకి తీసుకుని, అక్కడ ఉన్న వారిని సంఘటనపై విచారించారు.
ఆయుధాలను ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్నించగా.. తన ప్రాణానికి ముప్పు ఉందని, భద్రతా కారణాల దృష్ట్యా వాటిని తెచ్చానని సింగ్ చెప్పారు. అయితే తనకు ఎవరి నుండి ముప్పు ఉందనే విషయాన్ని మాత్రం ఆమె చెప్పడానికి నిరాకరించారు.
“నేను పదే పదే ఒకే మాట చెప్పలేను. నాకు రక్షణ లేదనిపిస్తోంది. అందుకే వీటిని తెచ్చానని ఇప్పటికే చెప్పాను. మళ్లీ మళ్లీ అదే స్టేట్మెంట్ ఇవ్వను. ప్రస్తుతం నేను ఎవరి పేరునూ బయటపెట్టను” అని ఆమె పేర్కొన్నారు.

దర్యాప్తు, చట్టపరమైన చర్యలు ప్రారంభం
ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యాశాఖ వెంటనే స్పందించిందని జిల్లా బేసిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (BSA) కమలేంద్ర కుష్వాహా తెలిపారు. ఆయన వెంటనే విచారణకు ఆదేశించి, ఆలస్యం చేయకుండా బీఈఓ నీరజ్ ఉమ్రావ్ను పాఠశాలకు పంపినట్లు చెప్పారు. ప్రిన్సిపాల్పై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు కుష్వాహా ధృవీకరించారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ప్రిన్సిపాల్ శిఖా సింగ్పై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేస్తున్నారని, విచారణ నివేదిక సిద్ధమవుతోందని మరియు ఆమెను సస్పెండ్ చేసే ప్రక్రియ కూడా ప్రారంభమైందని చెప్పారు. విద్యాసంస్థల్లో భయాందోళన వాతావరణాన్ని సృష్టించడానికి ఎవరినీ అనుమతించబోమని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
శుక్రవారం ఉదయం ప్రిన్సిపాల్ ఆయుధాలతో పాఠశాలకు వచ్చినట్లు తనకు సమాచారం అందిందని బీఈఓ ఉమ్రావ్ తెలిపారు. తాను పాఠశాలకు వెళ్లే దారిలో ఉండగా ఒక విద్యార్థి తండ్రి ఫోన్ చేసి, శిఖా సింగ్ స్కూల్కు చేరుకోవడానికి ముందే దారిలో ఒకరిద్దరు తల్లిదండ్రులకు ఆ ఆయుధాలను చూపించి భయపెట్టారని ఆరోపించినట్లు ఆయన చెప్పారు.
పాఠశాలలోని మిగిలిన ఉపాధ్యాయుల స్టేట్మెంట్లను రికార్డు చేశామని, శిఖా సింగ్ భర్తతో కూడా మాట్లాడినట్లు ఉమ్రావ్ తెలిపారు. ఉమ్రావ్ సమాచారం ప్రకారం.. శిఖా సింగ్ కొంతకాలంగా మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండవచ్చని ఆమె భర్త పేర్కొన్నారు.
పోలీసులు శిఖా సింగ్ స్టేట్మెంట్ను రికార్డు చేసి, కత్తి మరియు చాకును స్వాధీనం చేసుకుంటున్న సమయంలో అక్కడికి రావాలని ఆమె కుటుంబ సభ్యులను కోరినట్లు ఉమ్రావ్ వివరించారు.
Also Read: Pure Ghee: ఈ చిన్న చిట్కాలతో అసలైన నెయ్యిని నిమిషాల్లో కనిపెట్టండి!
