Tirumala: తిరుమలలో టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఘటన ఒకటి చర్చనీయాంశంగా మారింది. దివ్వెల మాధురి మరియు బిగ్బాస్ ఫేమ్ తనూజ ఈ వివాదంలోకి వచ్చారు. తనూజ పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు కేక్ తీసుకెళ్లి అక్కడే కట్ చేయడం వివాదానికి కారణమైంది. తిరుమల ప్రాంతానికి కేక్ తీసుకురావడం, అలాగే అతిథిగృహంలో కేక్ కట్ చేయడం తితిదే నియమాలకు విరుద్ధమని తెలిసింది.
గురువారం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి, తనూజ కలిసి శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చారు. ఈ సందర్భంగా వారు శ్రీపద్మావతి విచారణ కేంద్రం పరిధిలో ఉన్న శ్రీవిభవ అతిథిగృహంలో వసతి తీసుకున్నారు. అక్కడే తనూజ పుట్టినరోజు జరుపుకుంటూ కేక్ కట్ చేసినట్లు సమాచారం. ఈ వేడుకలో మాధురి స్వయంగా తనూజతో కేక్ కట్ చేయించినట్లు తెలిసింది.
View this post on Instagram
ఈ కార్యక్రమాన్ని వీడియోగా చిత్రీకరించి దివ్వెల మాధురి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం బయటకు వచ్చింది. దీంతో తిరుమలలో నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
View this post on Instagram
ఈ ఘటనపై తితిదే ఉన్నతాధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన వివరాలను వారు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. అవసరమైతే తదుపరి చర్యలు తీసుకునే అవకాశముందని కూడా చెబుతున్నారు.
ఇదే సమయంలో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి గతంలో కూడా ఒకసారి వివాదంలో నిలిచారు. అప్పట్లో శ్రీవారి ఆలయం ముందు ఫోటోషూట్ నిర్వహించడం విమర్శలకు దారితీసింది. ఇప్పుడు మరోసారి తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా కేక్ కట్ చేసిన ఘటనతో వారు మళ్లీ వార్తల్లో నిలిచారు.
