Viral: హైదరాబాద్ కూకట్పల్లి ప్రాంతంలోని రామకృష్ణా నగర్లో ఒక విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఏసు ప్రభువు వచ్చి మృతదేహానికి ప్రాణం పోస్తాడని నమ్మిన కుటుంబ సభ్యులు, చనిపోయిన మహిళ మృతదేహాన్ని నాలుగు రోజుల పాటు ఇంట్లోనే ఉంచుకుని ప్రార్థనలు చేశారు.
ఏపీలోని కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన ఏసురత్నం పోలీసు శాఖలో ఎస్ఐగా పనిచేసి రిటైర్ అయ్యారు. కొన్ని సంవత్సరాలుగా ఆయన కుటుంబం కూకట్పల్లిలోని రామకృష్ణా నగర్లో ఒక అపార్ట్మెంట్లో నివసిస్తోంది. కొన్నేళ్ల క్రితం ఏసురత్నం మరణించారు. ప్రస్తుతం ఆయన భార్య శమంతకమణి, కొడుకు జయరాం, కూతుళ్లు సునీత, శైలజ కలిసి ఉంటున్నారు. నలభై ఏళ్లు దాటినా జయరాం, సునీత, శైలజకు పెళ్లి కాలేదు. సునీత, శైలజ ఇద్దరూ తమ తల్లి వద్దే ఉంటున్నారు.
కొద్ది రోజుల క్రితం శైలజ అనారోగ్యానికి గురికావడంతో స్థానిక రాందేవ్రావు ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స సమయంలో కుటుంబ సభ్యులు ఆసుపత్రి సిబ్బందికి సరిగా సహకరించలేదు. రక్తహీనతతో బాధపడుతున్న శైలజకు రక్తం ఎక్కించాలని డాక్టర్లు సూచించినా, “పరిశుద్ధమైన రక్తమే కావాలి” అంటూ వారు నిరాకరించారు.
ఈ నెల 13న శైలజ మరణించింది. ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చి, ఏసు ప్రభువు తిరిగి ప్రాణం పోస్తాడని నమ్మి ఇంట్లోనే ఉంచుకుని ప్రార్థనలు చేయసాగారు. కొన్ని రోజుల తర్వాత దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు అక్కడికి చేరుకుని తలుపులు తెరవాలని చెప్పినా కుటుంబ సభ్యులు మొదట వినలేదు. తలుపులు బద్దలుకొట్టి మున్సిపల్ సిబ్బందితో మృతదేహాన్ని తరలిస్తామని పోలీసులు హెచ్చరించడంతో చివరకు తలుపులు తెరిచారు. అనంతరం పోలీసులు నచ్చచెప్పడంతో శైలజ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తమ స్వగ్రామానికి తరలించారు.
