Andhra: ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. బతికున్న చేప ఒక మత్స్యకారుడి గొంతులో ఇరుక్కుపోవడంతో అతను ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయితే వైద్యులు సమయానికి శస్త్రచికిత్స చేసి చేపను తొలగించడంతో అతను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
ఒంగోలుకు చెందిన మత్స్యకారుడు సుబ్రహ్మణ్యం గురువారం చేపల వేటకు వెళ్లాడు. వలలో పడిన చేపలను వేరుచేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఒక చేప ఎగిరి అతని నోటిలోకి వెళ్లింది. వెంటనే తీసేయడానికి ప్రయత్నించినప్పటికీ, అది గొంతులోకి జారి అక్కడే ఇరుక్కుపోయింది. దీంతో సుబ్రహ్మణ్యం ఊపిరి తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడుతూ విలవిల్లాడాడు.
ఈ ఘటనను గమనించిన తోటి మత్స్యకారులు వెంటనే అతన్ని ఒంగోలు ప్రభుత్వాసుపత్రి జీజీహెచ్ (GGH) కు తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించగా చేప అతని గొంతులోనే ఇరుక్కుపోయిందని గుర్తించారు. అనంతరం ఈఎన్టీ విభాగానికి చెందిన హెచ్ఓడీ డాక్టర్ ప్రభాకర్ నేతృత్వంలో వైద్య బృందం అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించింది.
సర్జరీ ద్వారా గొంతులో ఇరుక్కున్న చేపను విజయవంతంగా బయటకు తీశారు. ప్రస్తుతం సుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సమయానికి ఆసుపత్రికి తరలించడంతో అతను పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడని వైద్యులు వెల్లడించారు.
