Mobile: ఒడిశా రాష్ట్రంలో మొబైల్ సేవల వినియోగం గణనీయంగా పెరిగిందని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. 2025 సంవత్సరంలో ఒడిశా ప్రజల నుంచి టెలికాం కంపెనీలు కలిపి సుమారు రూ.8,729 కోట్లు ఆదాయం ఆర్జించాయి. అంటే సగటున రోజుకు దాదాపు రూ.24 కోట్లు మొబైల్ సేవలపై ఖర్చు అవుతున్నట్లు అర్థం. గంటకు చూస్తే దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేస్తున్నట్లుగా గణాంకాలు సూచిస్తున్నాయి.
వార్షిక ఆదాయం – కంపెనీల స్థితి
2025 సంవత్సరానికి సంబంధించిన వివరాల ప్రకారం, జియో కంపెనీ ఒడిశాలో అత్యధిక ఆదాయం సాధించింది. జియో సుమారు రూ.4,470 కోట్ల ఆదాయం నమోదు చేసి మొదటి స్థానంలో నిలిచింది. ఎయిర్టెల్ రూ.3,269 కోట్లతో రెండో స్థానంలో ఉంది. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ రూ.760 కోట్లు వసూలు చేసింది. వొడాఫోన్ ఐడియా రూ.212 కోట్లు సంపాదించగా, టాటా టెలిసర్వీసెస్ దాదాపు రూ.18 కోట్ల ఆదాయం నమోదు చేసింది.
మార్కెట్ వాటా పరంగా కూడా జియో ముందంజలో ఉంది. జియోకు 52.32 శాతం ఆదాయ వాటా ఉండగా, ఎయిర్టెల్ 37.38 శాతంతో రెండో స్థానంలో ఉంది. బీఎస్ఎన్ఎల్ 7.60 శాతం వాటా పొందింది. వొడాఫోన్ ఐడియా 2.48 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది. టాటా టెలిసర్వీసెస్ 0.2 శాతం స్వల్ప వాటాతో ఉంది.
సబ్స్క్రైబర్ల సంఖ్య
డిసెంబర్ 2025 నాటికి ఒడిశాలో మొత్తం మొబైల్ సబ్స్క్రైబర్ల సంఖ్య 3,72,62,298కు చేరుకుంది. వీరిలో జియోకు అత్యధికంగా 1,72,54,138 మంది వినియోగదారులు ఉన్నారు. ఎయిర్టెల్ 1,29,99,819 మంది యూజర్లతో రెండో స్థానంలో ఉంది. బీఎస్ఎన్ఎల్కు 55,18,354 మంది సబ్స్క్రైబర్లు ఉండగా, వొడాఫోన్ ఐడియా వినియోగదారుల సంఖ్య 14,89,987గా ఉంది.
