Human Body After Death: మనిషి పుట్టుక ఎలాగో మరణం కూడా ప్రకృతి ధర్మం. పుట్టిన ప్రతి ఒక్కరూ మట్టిలో కలవక తప్పదు. కాకపోతే ఒకరు ముందు, మరొకరు వెనక అంతే. అయితే మనిషి ప్రాణం పోయిన వెంటనే శరీరంలో ఏం జరుగుతుందనే(Human Body After Death) విషయంపై చాలా మంది ఎన్నో సందేహాలు ఉంటాయి. వైద్య విజ్ఞాన శాస్త్రం (Medical Science) ప్రకారం, మరణం అనేది ఒకే ఒక్క క్షణంలో ముగిసిపోయే ప్రక్రియ కాదు. అది ఒక దశలవారీగా జరిగే జీవశాస్త్ర ప్రక్రియ. ముఖ్యంగా మనిషి చనిపోయిన మొదటి ఒక గంట అంటే 60 నిమిషాల వ్యవధిలోనే మన శరీరంలో అనేక భౌతిక, రసాయన మార్పులు వేగంగా చోటుచేసుకుంటాయి. ఆ మార్పులు ఏమిటంటే..

1. గుండె ఆగిపోవడం & రక్త ప్రసరణ నిలిచిపోవడం
వైద్యపరంగా మరణాన్ని నిర్ధారించే మొదటి సంకేతం గుండె కొట్టుకోవడం ఆగడం. గుండె ఆగిపోయిన మరుక్షణమే శరీరంలోని ప్రాణవాయువు (ఆక్సిజన్) సరఫరా నిలిచిపోతుంది. దీనివల్ల మెదడుకు, ఇతర ముఖ్యమైన అవయవాలకు రక్తం అందదు. రక్తం ప్రవహించడం ఆగిపోవడంతో, గురుత్వాకర్షణ శక్తి కారణంగా రక్తం శరీరం కింది భాగాలకు చేరుకుని అక్కడ గడ్డకట్టడం ప్రారంభమవుతుంది.
2. ప్రైమరీ ఫ్లాసిడిటీ (మజిల్ రిలాక్సేషన్)
చనిపోయిన మొదటి కొన్ని నిమిషాల్లోనే శరీరంలోని కండరాలన్నీ తీవ్రమైన సడలింపునకు (Primary Flaccidity) గురవుతాయి. కండరాలపై నాడీ వ్యవస్థ నియంత్రణ పూర్తిగా కోల్పోవడం వల్ల కనురెప్పలు, దవడలు, మెడ, కాళ్ళు-చేతులు పూర్తిగా వదులైపోతాయి. దీనివల్ల శరీరం బరువుగా, చలనం లేకుండా మారుతుంది.
3. ఉష్ణోగ్రత పడిపోవడం (అల్గోర్ మోర్టిస్)
జీవించి ఉన్నప్పుడు మనిషి శరీర ఉష్ణోగ్రతను జీవక్రియలు (Metabolism) స్థిరంగా ఉంచుతాయి. కానీ మరణించిన తర్వాత శరీరం వేడిని విడుదల చేయడం ఆపేస్తుంది. మొదటి గంటలోనే శరీరం చుట్టుపక్కల ఉండే వాతావరణ ఉష్ణోగ్రతకు అనుగుణంగా చల్లబడటం ప్రారంభమవుతుంది. వైద్యశాస్త్రంలో ఈ ప్రక్రియను ‘అల్గోర్ మోర్టిస్’ (Algor Mortis) అంటారు. సాధారణంగా గంటకు దాదాపు 1.5 డిగ్రీల ఫారెన్హీట్ చొప్పున శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది.
4. చర్మం రంగు మారడం (లివోర్ మోర్టిస్ ప్రారంభం)
రక్త ప్రసరణ ఆగిపోవడంతో చర్మానికి వెళ్లే రక్తం నిలిచిపోయి, చర్మం వివర్ణంగా (తెల్లగా లేదా పిండంలా) మారుతుంది. గురుత్వాకర్షణ వల్ల రక్తం కింది భాగాల్లో జమవ్వడం వల్ల, నేలను తాకి ఉన్న భాగాల్లో చర్మం నీలం లేదా ఊదా (Purple) రంగులోకి మారడం మొదటి గంటలోనే మెల్లగా ప్రారంభమవుతుంది. దీన్ని ‘లివోర్ మోర్టిస్’ (Livor Mortis) అంటారు.
5. వ్యర్థాలు బయటకు రావడం
కండరాల నియంత్రణ (Sphincter muscles) పూర్తిగా కోల్పోవడం వల్ల, జీర్ణవ్యవస్థ, మూత్రాశయంలో ఉండే వ్యర్థాలు (మూత్రం, మలం) కొన్నిసార్లు వాటంతట అవే బయటకు వచ్చే అవకాశం ఉంది.
చనిపోయిన మొదటి గంటలో జరిగే ఈ మార్పులన్నీ శరీరం తన జీవక్రియలను పూర్తిగా ముగిస్తుంది. ఇదే ప్రకృతిలో కలిసిపోయే ప్రక్రియకు తొలిమెట్టు. ఈ మార్పుల ఆధారంగానే ఫోరెన్సిక్ నిపుణులు మనిషి ఎప్పుడు చనిపోయాడో (Time of Death) ఖచ్చితంగా అంచనా వేస్తారు.
Also Read: Phone Hack: మీ ఫోన్ హ్యాక్ అయిందా.. కేవలం 2 నిమిషాల్లోనే తెలుసుకోవచ్చు
