Khamenei faces personal loss amid Iran-US conflict, family members killed: Report
Khamenei: ఇజ్రాయెల్–అమెరికా సంయుక్త దాడులతో ఇరాన్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ కుటుంబానికి పెద్ద దెబ్బ తగిలినట్లు ఇరాన్ మీడియా అధికారికంగా వెల్లడించింది. ఖమేనీ కుటుంబంలో నలుగురు సభ్యులు మృతి చెందినట్లు ప్రకటించింది. ఆయన కూతురు, అల్లుడు, కోడలు, మనవడు ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయినట్లు స్పష్టం చేసింది.
ఈ జాయింట్ ఆపరేషన్లో భాగంగా ఖమేనీ నివాసంపై సుమారు 30 బాంబులు వదిలినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ దాడి కోసం ఇజ్రాయెల్ కొన్ని నెలలుగా ప్రణాళిక సిద్ధం చేసిందని, దేశంలోని అగ్ర నాయకులు ఒకే చోట ఉన్న సమయంలో దాడి జరిపిందని మీడియా నివేదికలు సూచిస్తున్నాయి.
ఇక మరోవైపు, అలీ ఖమేనీ మృతి చెందినట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రకటించినట్టు సమాచారం. అయితే ఈ అంశంపై స్పష్టతపై అంతర్జాతీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.
ఇజ్రాయెల్–అమెరికా దాడుల వల్ల ఇరాన్లో భారీ ప్రాణ నష్టం సంభవించింది. దేశంలోని 24 ప్రావిన్సులపై జరిగిన దాడుల్లో 201 మంది మృతి చెందినట్లు ఇరాన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ ప్రతినిధి మెహర్ వెల్లడించారు. అదనంగా 750 మందికి పైగా గాయపడినట్లు, వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకున్న వేలాది మంది భారతీయులు ఆందోళన చెందుతున్నారు. తమను సురక్షితంగా దేశానికి తరలించాలని కోరుతూ వారు సోషల్ మీడియాలో వీడియోలు విడుదల చేస్తున్నారు. మొత్తం పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
Khamenei: ఖమేనీ కుటుంబంలో నలుగురు మృతి..!