Sepsis: బ్రిటన్లో జరిగిన ఒక విషాదకర సంఘటన అందరినీ షాక్కు గురిచేసింది. ఒక చిన్న గాయం, పెంపుడు కుక్క నాకడం… ఈ రెండు కారణాల వల్ల ఓ మహిళ జీవితం పూర్తిగా మారిపోయింది. కేవలం కొన్ని గంటల్లోనే ఆమె తీవ్రమైన సెప్సిస్ (Sepsis) అనే ఇన్ఫెక్షన్కు గురై, చివరకు కాళ్లు, చేతులు కోల్పోవాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే… లండన్కు చెందిన మంజిత్ సంఘా అనే మహిళకు 2025 జులైలో చిన్న గాయం అయింది. శనివారం రోజున ఆమె తన పెంపుడు కుక్కతో ఆడుకుంటుండగా, ఆ కుక్క ఆమె గాయాన్ని నాకింది. మొదట్లో అది పెద్ద సమస్యగా అనిపించలేదు. అయితే కొద్ది గంటల్లోనే ఇన్ఫెక్షన్ శరీరంలో వేగంగా వ్యాపించింది.
ఆదివారం ఆమె సాధారణంగానే ఆఫీసుకు వెళ్లింది. కానీ మధ్యాహ్నం నుంచి అస్వస్థతగా అనిపించడంతో ఇంటికి తిరిగి వచ్చింది. మరుసటి రోజు ఉదయానికి పరిస్థితి మరింత విషమించింది. రాత్రి అయ్యేసరికి మంజిత్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమె కాళ్లు, చేతులు చల్లబడ్డాయి. పెదాల రంగు మారిపోయింది. ఊపిరి తీసుకోవడానికే తీవ్ర ఇబ్బంది ఎదురైంది.
ఆందోళన చెందిన భర్త కమల్జిత్ వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించాడు. వైద్యులు ఆమెను ఐసీయూలో చేర్చి అత్యవసర చికిత్స ప్రారంభించారు. సెప్సిస్ కారణంగా రక్తంలో ఇన్ఫెక్షన్ తీవ్రమై, ప్రాణాపాయం ఏర్పడింది. ప్రాణాలు కాపాడేందుకు డాక్టర్లు ఇన్ఫెక్ట్ అయిన ఆమె కాళ్లు, చేతులను సగం వరకు తొలగించాల్సి వచ్చింది.
మంజిత్ మొత్తం 32 వారాల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందింది. ఈ సమయంలో ఆమెకు ఆరు సార్లు కార్డియాక్ అరెస్ట్ కూడా వచ్చింది. అయినప్పటికీ వైద్యుల కృషి, అదృష్టం కలిసి ఆమె ప్రాణాలతో బయటపడింది.
ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మంజిత్ ఇంటికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె భర్త మీడియాతో మాట్లాడుతూ, “కేవలం 24 గంటల్లో ఇంత భయంకరమైన పరిస్థితి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. శనివారం కుక్కతో ఆడుకుంది, ఆదివారం డ్యూటీకి వెళ్లింది, సోమవారం రాత్రికి కోమాలోకి వెళ్లిపోయింది” అంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు.
