Crime: వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో 21 ఏళ్ల యువతి అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనలో గంజాయికి బానిసలైన నలుగురు యువకులు యువతిని కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారం చేసి అనంతరం హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, బుధవారం రాత్రి నిందితులు యువతిని అపహరించి ఒక నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ గంజాయి మత్తులో ఉన్న వారు ఆమెపై అమానుషంగా గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారని తెలిపారు. ఈ ఘటనలో యువతికి తీవ్ర రక్తస్రావం కావడంతో, విషయం బయటపడకుండా ఉండేందుకు ఆమెను ఉరివేసి చంపేశారని ఆరోపిస్తున్నారు. ఈ నిందితులు ఎప్పుడూ గంజాయి మత్తులో ఉండి గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారని, వారి చర్యలే ఒక అమాయక యువతి ప్రాణం తీసాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం వర్ధన్నపేట మార్చురీకి తరలించారు. అయితే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా సరైన చర్యలు తీసుకోవడంలేదని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ, వర్ధన్నపేట వద్ద ఖమ్మం జాతీయ రహదారిపై మృతదేహంతో ఆందోళన చేపట్టారు. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయి, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
నిందితులను కఠినంగా శిక్షించే వరకు పోస్టుమార్టం నిర్వహించనివ్వమని బాధితురాలి తల్లిదండ్రులు స్పష్టం చేశారు. మార్చురీ వద్ద పెద్ద సంఖ్యలో బంధువులు, స్థానికులు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమ కుమార్తెకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకూడదని, నిందితులకు గట్టిగా శిక్ష పడాలని వారు నినదించారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి బాధిత కుటుంబాన్ని సమాధానపరచే ప్రయత్నం చేశారు. ఇప్పటికే కేసు నమోదు చేసి, నిందితుల కాల్ డేటా మరియు ఇతర ఆధారాలను సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు. పోలీసుల హామీతో బాధితురాలి కుటుంబ సభ్యులు చివరికి ఆందోళనను విరమించారు.
