Crime: ఖమ్మం నగరంలో ఆటో డ్రైవర్ హత్య కేసు సంచలనం సృష్టించింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు జరిపి అసలు నిజాన్ని బయటపెట్టగా, భార్యే భర్త హత్యకు ప్రధాన సూత్రధారిగా తేలింది. బీమా డబ్బుల కోసం భార్య తన భర్తను చంపించిందని పోలీసులు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం నగరానికి చెందిన చాగంటి రవి (52) ఆటో డ్రైవర్గా పని చేసేవాడు. అతను మద్యానికి బానిసై కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ పరిస్థితిని గమనించిన అతని భార్య ప్రశాంతి, భర్త త్వరలోనే చనిపోతాడని భావించి ముందుగానే డబ్బులు పొందాలని పథకం వేసింది.
ఈ క్రమంలో తన బంధువు శ్రీనివాస్ సహాయంతో గత ఏడాది జూలైలో రవి పేరుతో రూ.66 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంది. భర్త మరణిస్తే ఆ బీమా డబ్బులతో సుఖంగా జీవించవచ్చని ఆమె భావించింది. కానీ కొంతకాలం తర్వాత రవి ఆరోగ్యం కుదుటపడడంతో ఆమె పథకం విఫలమైంది.
దాంతో బీమా డబ్బులు పొందాలనే ఉద్దేశంతో భర్తను హత్య చేయాలని ఆమె నిర్ణయించుకుంది. ఈ పని కోసం బంధువు శ్రీనివాస్తో పాటు జోగి రాజ్కుమార్, జోగి వెంకటేష్, జోగి రాంబాబులను సంప్రదించింది. భర్తను చంపితే వచ్చే బీమా డబ్బులో సగం ఇస్తానని వారికి ఆఫర్ ఇచ్చి ఒప్పందం కుదుర్చుకుంది.
ఆమె వేసిన ప్రణాళిక ప్రకారం మార్చి 2న రవికి ఎక్కువగా మద్యం తాగించారు. అనంతరం ఖమ్మం సమీపంలోని వీవీ పాలెం శివారు ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ రవిని కారుతో ఢీకొట్టి రోడ్డు ప్రమాదంలా కనిపించేలా ప్లాన్ చేశారు. ఈ ఘటనను ప్రమాదంగా చూపించేందుకు ప్రయత్నించారు.
అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అనుమానంతో లోతుగా దర్యాప్తు చేపట్టారు. పలు సాంకేతిక ఆధారాలను సేకరించి పరిశీలించగా, ఇది సాధారణ రోడ్డు ప్రమాదం కాదని, ముందుగా పన్నిన హత్య అని తేలింది.
చివరకు పోలీసులు ఈ కేసులో మృతుడి భార్య ప్రశాంతితో పాటు మరో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బీమా డబ్బుల కోసం భార్యే భర్తను హత్య చేయించిందన్న విషయం బయటపడటంతో ఈ ఘటన ఖమ్మం నగరంలో తీవ్ర కలకలం రేపింది.
Also Read: Hardik Pandya: స్టేడియంలోనే ముద్దులతో రెచ్చిపోయిన హార్దిక్..!
Crime: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తను చంపించిన భార్య
