Accident: ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కలచివేసింది. టిప్పర్ లారీ మరియు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఈ ప్రమాదంలో 15 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో బస్సులో ఉన్న కొందరు ప్రయాణికులు సజీవదహనం కావడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. గాయపడిన వారికి అందుతున్న వైద్య సహాయం గురించి వివరాలు అడిగి తెలుసుకుని, వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ నుంచి ఏపీలోని నెల్లూరుకు వెళ్తున్న హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఈ ఘటనలో మరో 20 మంది ప్రయాణికులు గాయపడగా, వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్న సమాచారంతో సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలను సమగ్రంగా విచారించి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
ఇక మంత్రి నారా లోకేశ్ కూడా ఈ ఘటనపై స్పందిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రాయవరం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు సజీవదహనం కావడం చాలా బాధాకరమని అన్నారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సహాయం అందించాలని ఇప్పటికే అధికారులకు సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
