Whatspp: మెసేజింగ్ యాప్ వాట్సాప్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 28 తర్వాత సిమ్ లేకుండా వాట్సాప్ పనిచేయదని స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రకటించిన ‘సిమ్ అనివార్యం’ నిబంధనకు ఈ నెల 28నే గడువు అని, దానిని పొడిగించే అవకాశం లేదని కేంద్రం వెల్లడించింది.
కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకారం, ఈ నిర్ణయం జాతీయ భద్రత దృష్ట్యా తీసుకున్నదని తెలిపారు. సైబర్ నేరగాళ్ల కార్యకలాపాలను నియంత్రించేందుకు, యూజర్ల భద్రత కోసం ఈ కొత్త నియమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. కొత్త నిబంధనల ప్రకారం వాట్సాప్ మాత్రమే కాకుండా టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్చాట్, షేర్చాట్, జియోచాట్, అరాటై, జోష్ వంటి సోషల్ మీడియా యాప్లు ఉపయోగించాలంటే మొబైల్ ఫోన్లో చెల్లుబాటు అయ్యే సిమ్ కార్డు తప్పనిసరిగా ఉండాలి.
మార్చి 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయి. ఇంతవరకు మొబైల్ నుంచి సిమ్ కార్డు తీసేసినా వాట్సాప్ యాప్ పనిచేసేది. కానీ ఇకపై రిజిస్టర్డ్ సిమ్ ఫోన్లో ఉండాలి. అంతేకాదు, ఆ సిమ్ యాక్టివ్గా ఉండాలి. అంటే రీచార్జ్ చేసి పనిచేసే స్థితిలో ఉండాలి.
ఇంకా ఒక ముఖ్యమైన మార్పు కంప్యూటర్ లేదా ల్యాప్టాప్లో వాట్సాప్ వాడకానికి సంబంధించినది. ఇప్పటివరకు ఒకసారి లాగిన్ అయితే అనేక రోజుల పాటు యాక్టివ్గా ఉండేది. అయితే కొత్త నిబంధనల ప్రకారం కంప్యూటర్లో లాగిన్ చేసిన వాట్సాప్ ఆరు గంటల తర్వాత ఆటోమేటిక్గా లాగౌట్ అవుతుంది. మళ్లీ ఉపయోగించాలంటే మొబైల్లో యాక్టివ్ సిమ్ ఉండి, తిరిగి లాగిన్ చేయాలి.
గతంలో ఎక్కడి నుంచైనా ఓటీపీ ద్వారా వాట్సాప్కు లాగిన్ అయ్యే వీలుండేది. కానీ ఇకపై సిమ్ లేకుండా వాట్సాప్ ఉపయోగించడం సాధ్యం కాదు. ఈ చర్యలతో నకిలీ ఖాతాలు, సైబర్ నేరాలను తగ్గించవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
