Tragedy: కర్ణాటక రాజధాని బెంగళూరులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఐటీ సంస్థలో పనిచేస్తున్న 27 ఏళ్ల యువతి విద్యాజ్యోత్ ఆత్మహత్యకు పాల్పడింది. బగలగుంటే ప్రాంతంలో నివసిస్తున్న ఆమె బాష్ సంస్థలో ఉద్యోగం చేస్తూ, ఇటీవల కొన్ని రోజులుగా వర్క్ ఫ్రమ్ హోమ్లో పనిచేస్తోంది.
విద్యాజ్యోత్ కొడగు ప్రాంతానికి చెందిన ఒక యువకుడిని ప్రేమించింది. ఈ విషయం తెలిసిన తర్వాత ఇరు కుటుంబాలు కూడా వారి వివాహానికి అంగీకారం తెలిపాయి. పెళ్లి ఏర్పాట్లు జరగాల్సి ఉండగా, పెళ్లి తర్వాత తన జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆమె ఒక జ్యోతిష్కుడిని సంప్రదించింది.
అయితే ఆ జ్యోతిష్కుడు చేసిన వ్యాఖ్యలు ఆమెను తీవ్ర మనస్తాపానికి గురిచేశాయి. ప్రేమించిన వ్యక్తితో ఆమె వివాహం నిలవదని, రెండేళ్లలోనే విడిపోతారని అతడు చెప్పినట్టు సమాచారం. ఆ సమస్యలను నివారించేందుకు తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు చేయాలని సూచించాడు.
జ్యోతిష్కుడి మాటలను నమ్మిన విద్యాజ్యోత్ అతడు చెప్పిన విధంగా పూజలు ప్రారంభించింది. తొమ్మిదో రోజు పూజ కోసం కుటుంబ సభ్యులు దేవాలయానికి వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి విషయం గుర్తించడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది.
