Bihar: బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జేడీయూ అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో తాను నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రకటనతో ఆయన త్వరలోనే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటారనే విషయంపై స్పష్టత వచ్చింది. 2005 నుంచి నిరవధికంగా బిహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నీతీశ్ కుమార్, ఇప్పుడు దేశంలోని పెద్దల సభ అయిన రాజ్యసభలోకి అడుగుపెట్టే దిశగా నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన బిహార్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గత రెండు దశాబ్దాలుగా ప్రజలు తనపై ఉంచిన విశ్వాసం వల్లే రాష్ట్రానికి సేవ చేయగలిగానని అన్నారు. ప్రజల సహకారం, నమ్మకం కారణంగానే బిహార్ అభివృద్ధి మార్గంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. రాష్ట్రానికి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు రావడానికి కూడా ప్రజల మద్దతే ప్రధాన కారణమని ఆయన అన్నారు. ఇంతకాలం తనకు అండగా నిలిచిన బిహార్ ప్రజలకు మరోసారి ధన్యవాదాలు తెలియజేశారు.
రాజ్యసభకు వెళ్లాలనే నిర్ణయం గురించి కూడా నీతీశ్ కుమార్ వివరించారు. తన పార్లమెంటరీ జీవిత ప్రారంభ దశల్లోనే ఒక లక్ష్యం పెట్టుకున్నానని చెప్పారు. బిహార్ అసెంబ్లీ, శాసన మండలి మాత్రమే కాకుండా దేశ పార్లమెంటులోని లోక్సభ, రాజ్యసభల్లో కూడా సభ్యుడిగా పనిచేయాలని అప్పట్లోనే భావించానని తెలిపారు. ఇప్పుడు ఆ ఆశయాన్ని నెరవేర్చుకునే సమయం వచ్చిందని అన్నారు. అందుకే ఈసారి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
తాను రాజ్యసభకు వెళ్లినా బిహార్ ప్రజలతో తన అనుబంధం ఎప్పటికీ అలాగే కొనసాగుతుందని నీతీశ్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఎలాంటి రాజీ పడబోనని తెలిపారు. ఇక రాష్ట్రంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వానికి తనవంతు పూర్తి సహకారం అందిస్తానని కూడా ఆయన హామీ ఇచ్చారు.
Bihar CM Nitish Kumar tweets, “… I seek to become a member of the Rajya Sabha in the elections being held this time. I want to assure you with complete honesty that my relationship with you will continue in the future as well, and my resolve to work together with you to build a… pic.twitter.com/v4Z3N28gL0
— ANI (@ANI) March 5, 2026
