Principal Murder Case: నల్లగొండ జిల్లాలో ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసు(Principal Murder Case)సంచలనంగా మారింది. విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన ఆమెను దుండగులు గొంతు కోసి, కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. అనంతరం ఇంట్లో ఉన్న నగదును తీసుకుని పరారయ్యారు. పక్కా ప్రణాళికతో ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానించారు.
అయితే తాజాగా పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. రూపారెడ్డిని హత్య చేసింది ఆమె నిర్వహిస్తున్న నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్లో చదివిన ఇద్దరు పదో తరగతి విద్యార్థులేనని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ప్రస్తుతం నిందితులైన ఇద్దరి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
Also Read: Midday Meal: ఉప్పుకు బదులు డిటర్జెంట్.. 40 మంది విద్యార్థులకు అస్వస్థత!
నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఈ కేసును సీరియస్గా తీసుకుని దర్యాప్తు కోసం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. జల్సాలకు అలవాటు పడిన ఆ విద్యార్థులు డబ్బు కోసం ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే హత్యకు అసలు కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
Also Read: Fake Ghee: వామ్మో.. పాలు లేకుండానే నెయ్యి.. 25 టన్నులు సీజ్..!
కొండమల్లేపల్లి జేబీ కాలనీలో రూపారెడ్డి నివాసం ఉంటున్నారు. నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ నిర్వహకురాలిగా, ప్రిన్సిపల్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె భర్త రాజేందర్రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. హైదరాబాద్ శివారులోని గుర్రంగూడలో కూడా వీరికి ఇల్లు ఉంది. కుమారుడు అభినవ్ రెడ్డి హైదరాబాద్లో ఇంజినీరింగ్ చదువుతున్నాడు.
ఆగస్టు 8 నుంచి 10 వరకు వరుసగా మూడు రోజుల సెలవులు రావడంతో రూపారెడ్డి భర్తతో కలిసి హైదరాబాద్ వెళ్లి కుమారుడి వద్ద గడిపారు. అనంతరం ఆగస్టు 11న ఉదయం ఆమె ఒక్కరే కొండమల్లేపల్లికి తిరిగి వచ్చారు. భర్త పని నిమిత్తం హైదరాబాద్లోనే ఉండిపోయారు. ఆ తర్వాత ఆమె హత్యకు గురయ్యారు.
ప్రిన్సిపల్ను హత్య చేసిన వారు విద్యార్థులేనన్న విషయం వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను పోలీసులు దర్యాప్తు అనంతరం వెల్లడించే అవకాశం ఉంది.
Also Read: AP News: ఆస్తి లేదని తండ్రి అంత్యక్రియలకు రాని కొడుకు
