Prakash Raj: కర్ణాటకలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj) స్పందించారు. బెంగళూరు ఓటర్ల జాబితాలో తన పేరు కనిపించడం లేదని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై ఓ వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. “ఆట మొదలైంది” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
SIR ప్రక్రియలో భాగంగా ఓటర్ల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోవాలని, ఏదైనా తప్పు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించి వివరాలను సరిచేసుకోవాలని సూచిస్తున్నారు.

ఓటర్ల జాబితాలో పేరు కనిపించడంపై ప్రకాష్ రాజ్ స్పందన
తన పేరు ఓటర్ల జాబితాలో కనిపించడం లేదని చెబుతూ ప్రకాష్ రాజ్ ఓ వీడియోను విడుదల చేశారు. అందులో ఆయన వ్యంగ్యంగా స్పందించారు.
“మిత్రులారా.. మీతో ఒక జోక్ పంచుకోవాలనుకుంటున్నాను. SIR ప్రక్రియ తర్వాత బెంగళూరు నియోజకవర్గంలో ఓటు హక్కును కోల్పోయిన 65 లక్షల మంది ఓటర్లలో నేనూ ఒకడిని. మంచి జోక్ కదా?” అని ఆయన అన్నారు.
తాను బెంగళూరులోనే పుట్టి పెరిగానని ప్రకాష్ రాజ్ తెలిపారు. తన పాఠశాల, కళాశాల, నాటక రంగ ప్రస్థానం కూడా అక్కడే సాగిందని చెప్పారు. అంతేకాకుండా ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేశానని గుర్తు చేశారు.
View this post on Instagram
“ఆట మొదలైంది” అంటూ ప్రకాష్ రాజ్
తన ఓటర్ ఐడీని తిరిగి పొందేందుకు ఏ ప్రక్రియను అనుసరించాలో తెలుసుకుంటానని ప్రకాష్ రాజ్ అన్నారు. “సరే.. ఆట మొదలైంది” అంటూ వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా ఓటు హక్కు విషయంలో అధికారాన్ని ఉపయోగించడం గురించి కూడా ఆయన ప్రశ్నలు సంధించారు. “మిమ్మల్ని ఎన్నుకోని కొందరు పౌరుల ఓటు హక్కును నిరాకరించడానికి మీరు మీ అధికారాలను ఉపయోగించవచ్చు. కానీ మిమ్మల్ని గద్దె దించే మా శక్తిని మీరు అడ్డుకోగలరా?” అంటూ ప్రశ్నించారు.
ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. “మిమ్మల్ని తిరిగి అధికారంలోకి తీసుకురాని కొందరు పౌరుల ఓటు హక్కును మీరు నిరాకరించవచ్చు. కానీ చివరికి మిమ్మల్ని మీ పీఠం నుంచి దించే మా ప్రయత్నాన్ని మీరు అడ్డుకోగలరా?” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అలాగే #justasking అనే హ్యాష్ట్యాగ్ను ఉపయోగించారు.
విద్యార్థులపై పోలీసుల చర్యను కూడా ఖండించిన నటుడు
ఇదిలా ఉండగా, జార్ఖండ్ రాజధాని రాంచీలో JPSC, JSSC అభ్యర్థులు చేపట్టిన నిరసనపై పోలీసులు తీసుకున్న చర్యను కూడా ప్రకాష్ రాజ్ ఖండించారు. అసెంబ్లీ సమీపంలో నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడం, లాఠీచార్జ్ చేసినట్లు కనిపించే వీడియోను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఈ ఘటనపై స్పందిస్తూ.. “ఎందుకు.. ఎందుకు.. ఎందుకు? ఈ అరాచకాన్ని ఇక సహించలేం. ఇది అహంకారంతో కూడిన అధికారాన్ని కూలదోయడానికే దారితీస్తుంది” అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
View this post on Instagram
ప్రస్తుతం ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు, ఆయన సినిమాల విషయానికి వస్తే.. ‘డకాయిట్: ఎ లవ్ స్టోరీ’, ‘జన నాయగన్’, ‘దృశ్యం 3’ వంటి చిత్రాల్లో కనిపించనున్నారు. అలాగే ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోని ‘స్పిరిట్’ సినిమాల్లోనూ ఆయన నటిస్తున్నారు.
Also Read: YouTube Monetization: క్రియేటర్లకు షాక్.. ఇకపై 8వేల వాచ్ అవర్స్ తప్పనిసరి!
