Education: ఇంటర్మీడియట్ విద్య అనేది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే కీలక దశగా భావించబడుతుంది. డాక్టర్, ఇంజినీర్, లాయర్, సైంటిస్ట్, టీచర్, టెక్నీషియన్, సివిల్ సర్వెంట్ లేదా గ్రూప్ అధికారి—ఏ లక్ష్యం ఉన్నా దానిని చేరుకోవడానికి ఇంటర్ ఒక వారధిలా పనిచేస్తుంది. అందుకే పది తరగతి తర్వాత ఏ గ్రూపు ఎంచుకోవాలో జాగ్రత్తగా నిర్ణయించుకోవడం చాలా ముఖ్యం.
తెలుగు రాష్ట్రాల్లో సుమారు 85 రకాల గ్రూపులు ఉన్నప్పటికీ, ఎక్కువమంది విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్ఈసీ వంటి ప్రముఖ గ్రూపులనే ఎంచుకుంటున్నారు. ప్రతి గ్రూపులో సాధారణంగా 3–4 ప్రధాన సబ్జెక్టులు ఉంటాయి. వీటితో పాటు ఇంగ్లీష్, ద్వితీయ భాష (తెలుగు/సంస్కృతం) కూడా తప్పనిసరిగా చదవాలి.
ఇంటర్ చదివితేనే ఐఐటీ-జేఈఈ, నీట్, క్లాట్, ఈఏపీసెట్, డైట్సెట్, లాసెట్ వంటి జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్షలకు అర్హత లభిస్తుంది. అందుకే భవిష్యత్తు లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రూపును ఎంచుకోవాలి.
ఎంపీసీ (MPC)
ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ వంటి కోర్సులు చేయాలనుకునేవారికి ఎంపీసీ సరైన ఎంపిక. పైలట్, ఫ్యాషన్ టెక్నాలజీ వంటి కోర్సులకు కూడా మ్యాథ్స్, ఫిజిక్స్ అవసరం. ఇంటర్ తర్వాత బీటెక్, బీఆర్క్ మాత్రమే కాకుండా బీఎస్సీ, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్ వంటి అనేక కోర్సులు చేయవచ్చు. అలాగే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ల్లో కూడా అవకాశాలు ఉంటాయి. ఆసక్తి మారితే బీఏ, బీకాం, బీబీఏ వంటి కోర్సులలోకి కూడా మారవచ్చు.
ఎంఈసీ (MEC)
కామర్స్, ఫైనాన్స్, బిజినెస్ రంగాల్లో కెరీర్ చేయాలనుకునేవారికి ఇది అనుకూలం. సీఏ, సీఎస్, సీఎంఏ వంటి ప్రొఫెషనల్ కోర్సులకు ఇది మంచి పునాది. అలాగే బిజినెస్ అనలిటిక్స్, స్టాటిస్టిక్స్, మేనేజ్మెంట్ రంగాల్లో అవకాశాలు ఉంటాయి. బీబీఏ, బీబీఎం, ఎంబీఏ వంటి కోర్సులకు ఇది దోహదపడుతుంది.
బైపీసీ (BiPC)
వైద్య రంగం వైపు వెళ్లాలనుకునే విద్యార్థులు బైపీసీ ఎంచుకోవాలి. మెడిసిన్, డెంటల్, నర్సింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్, బయోటెక్నాలజీ వంటి అనేక కోర్సులకు ఇది అవసరం. మైక్రోబయాలజీ, జెనెటిక్స్, ఫోరెన్సిక్ సైన్స్ వంటి ఆధునిక సబ్జెక్టుల్లో కూడా అవకాశాలు ఉన్నాయి.
సీఈసీ (CEC)
ఎకనామిక్స్, కామర్స్ కలయికతో ఉన్న ఈ గ్రూపు అకౌంటింగ్, ఫైనాన్స్ రంగాలకు అనుకూలం. సీఏ, సీఎస్, సీఎంఏతో పాటు బీబీఏ, ఎంబీఏ వంటి కోర్సులకు మార్గం సుగమం చేస్తుంది. న్యాయవిద్య, ఉపాధ్యాయ వృత్తి, టూరిజం, హోటల్ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో కూడా అవకాశాలు ఉన్నాయి.
హెచ్ఈసీ (HEC)
సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలనుకునే వారికి హెచ్ఈసీ ఉపయోగకరం. హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ వంటి సబ్జెక్టులు సామాజిక అవగాహన పెంచుతాయి. డిగ్రీలో పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, సైకాలజీ, జాగ్రఫీ వంటి సబ్జెక్టులు ఎంచుకోవచ్చు. బోధన, న్యాయవాద వృత్తుల్లో కూడా అవకాశాలు ఉన్నాయి.
గ్రూప్ ఎంపికలో జాగ్రత్తలు
ఏ సబ్జెక్టుపై ఆసక్తి ఉందో ముందుగా తెలుసుకోవాలి. భవిష్యత్తులో ఏ వృత్తిని ఎంచుకోవాలనుకుంటున్నారో ఆలోచించాలి. ఆ లక్ష్యానికి అవసరమైన కోర్సులు, సబ్జెక్టులు ఏవో తెలుసుకోవాలి. ఒకవేళ ఆ సబ్జెక్టులు కష్టంగా అనిపిస్తే లక్ష్యాన్ని మార్చుకోవడం మంచిది. ఆసక్తి ఉంటే మాత్రం కృషి చేసి ప్రావీణ్యం సాధించాలి.
మొత్తంగా, ఇంటర్మీడియట్ అనేది విద్యార్థి భవిష్యత్తుకు పునాది వేసే దశ. సరైన గ్రూపును ఎంచుకుని, లక్ష్యంతో ముందుకు సాగితే మంచి కెరీర్ సాధించవచ్చు.
