Allu Arjun: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్‌

Delhi high court set to pass orders protecting Allu Arjun’s personality rights

Delhi high court set to pass orders protecting Allu Arjun’s personality rights

Allu Arjun: గత కొంతకాలంగా సెలబ్రిటీలు తమ పర్సనాలిటీ హక్కుల పరిరక్షణ కోసం కోర్టులను ఆశ్రయించడం పెరిగింది. ఇప్పటికే భారతీయ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు తమ పేరు, ఫోటోలు, వాయిస్ వంటి అంశాల దుర్వినియోగంపై న్యాయస్థానాల నుంచి రక్షణ పొందారు. టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలు కూడా కోర్టులను ఆశ్రయించారు. ఇప్పుడు వారి బాటలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరారు.

అల్లు అర్జున్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తూ తన అనుమతి లేకుండా తన పేరు, ఫోటోలు, వీడియోలు, వాయిస్‌ను ఎవరూ ఉపయోగించకూడదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం డిజిటల్ యుగంలో సోషల్ మీడియా, ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ విస్తృతంగా పెరిగిన నేపథ్యంలో సెలబ్రిటీల కంటెంట్‌ను అనుమతి లేకుండా వాడటం సాధారణమైంది. కొన్ని కంపెనీలు వారి అనుమతి లేకుండానే వారి పేర్లను, చిత్రాలను ఉపయోగించి వ్యాపార లాభాలు పొందుతున్నాయి.

ఈ పరిస్థితుల నేపథ్యంలో అల్లు అర్జున్ తన వ్యక్తిగత హక్కుల రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా ముఖచిత్రాలు, వాయిస్‌ను మార్ఫింగ్ చేసి ప్రకటనల్లో వాడుతున్నారని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తన ప్రమేయం లేని వ్యాపారాల్లో తన పేరు వాడటం వల్ల తన బ్రాండ్ విలువకు నష్టం కలుగుతోందని తెలిపారు. ఈ కేసును జస్టిస్ తుషార్ రావు గెడెల ధర్మాసనం విచారించనుంది. గతంలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ వంటి ప్రముఖులకు లభించిన రక్షణనే తాను కూడా కోరుతున్నట్లు అల్లు అర్జున్ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే, మెగాస్టార్ చిరంజీవి కేసులో హైదరాబాద్ సివిల్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన అనుమతి లేకుండా ‘మెగాస్టార్’, ‘చిరు’ వంటి బిరుదులు, పేరు, ఫోటోలు, వాయిస్‌ను ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో ఉపయోగించకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఆన్‌లైన్ దుస్తుల సంస్థలు, డిజిటల్ మీడియా, యూట్యూబ్ ఛానెల్స్ సహా ఇతర సంస్థలు కూడా ఈ ఆదేశాలను పాటించాల్సిందేనని పేర్కొంది. అనధికార వినియోగం వల్ల ఆయన ప్రతిష్ఠకు నష్టం కలగవచ్చని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.

చిరంజీవి తన పిటిషన్‌లో కొన్ని సంస్థలు తన అనుమతి లేకుండా తన గుర్తింపును ఉపయోగించి ఆర్థిక లాభాలు పొందుతున్నాయని, దీనివల్ల తనకు ప్రతిష్ఠాపరంగా, ఆర్థికంగా నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. కోర్టు ఆయన వాదనలను సమర్థించి ఆయనకు అనుకూలంగా తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది.

అలాగే బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ కూడా తన పర్సనాలిటీ హక్కుల రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె ఫోటోలు, పేరు ఉపయోగించి AI ద్వారా అశ్లీల కంటెంట్ సృష్టిస్తున్నారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు, ఆమె అనుమతి లేకుండా ఆమె వ్యక్తిగత హక్కులను ఎవరూ వినియోగించరాదని స్పష్టం చేసింది. ఈ కేసులో పలు ఈ-కామర్స్ సంస్థలు మరియు ఇతర ప్లాట్‌ఫార్మ్స్‌కు కోర్టు కఠిన ఆదేశాలు జారీ చేసింది.

మొత్తానికి, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్, అరిజిత్ సింగ్, ఆశా భోస్లే, ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్, కరణ్ జోహార్, నాగార్జున, చిరంజీవి వంటి పలువురు ప్రముఖులు ఇప్పటికే తమ పర్సనాలిటీ హక్కుల కోసం కోర్టులను ఆశ్రయించి రక్షణ పొందారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే మార్గంలో ముందుకు సాగుతున్నారు. ఆయన పిటిషన్‌పై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.

Also Read: Akshaya Tritiya: అక్షయ తృతీయ.. బంగారం కొనుగోళ్లపై బంపర్ ఆఫర్లు

Allu Arjun: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్‌