Gold Price: ఇరాన్ – యునైటెడ్ స్టేట్స్ మధ్య కొనసాగుతున్న యుద్ధం తాత్కాలికంగా ముగియడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కొంత సానుకూల ప్రభావం కనిపిస్తోంది. దీని ప్రభావం భారత్తో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ప్రతిఫలిస్తోంది. ముఖ్యంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఏప్రిల్ 8న బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. బుధవారం స్థానిక బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.3,980 పెరగగా, కిలోగ్రాము వెండి ధర రూ.10,000 వరకు ఎగబాకింది. ఈ పెరుగుదలతో హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,820కు, కిలో వెండి ధర రూ.2,60,000కు చేరుకుంది.
అయితే గత కొన్ని రోజులుగా ఈ రెండు లోహాల ధరలు భారీగా పడిపోతున్నాయి. గత 68 రోజుల్లో బంగారం ధర సుమారు రూ.40,000 తగ్గగా, వెండి ధర రూ.1.75 లక్షల మేర పడిపోయింది. జనవరి 29, 2026న MCXలో బంగారం ధర రూ.1.93 లక్షలకు చేరి సర్వకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. అదే రోజున వెండి ధర కూడా కిలోకు రూ.4.20 లక్షల వరకు వెళ్లింది.
ఆ తరువాత నుంచి ధరలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ప్రస్తుతం చూస్తే, బంగారం తన గరిష్ఠ స్థాయి కంటే 10 గ్రాములకు సుమారు రూ.40,000 తక్కువగా ఉంది. అలాగే వెండి కూడా తన రికార్డు స్థాయి నుంచి కిలోకు రూ.1.75 లక్షలకు పైగా పడిపోయింది. మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో MCXలో వెండి ధర రూ.2,44,261గా నమోదైంది.
ఫిబ్రవరి 27, 2026న బంగారం ధర రూ.1,65,659 వద్ద గరిష్ఠ స్థాయిని చేరుకుంది. యుద్ధ పరిస్థితుల సమయంలో అది సుమారు రూ.12,363 (7.5%) మేర తగ్గింది. అంతర్జాతీయంగా కూడా జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ దాదాపు 3% పెరిగి ఔన్స్కు 4,813 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
నిపుణుల ప్రకారం, అమెరికా డాలర్ బలపడటం, బడ్జెట్ తర్వాత వచ్చిన మార్పులు, అలాగే గ్లోబల్ మార్కెట్లలో పెట్టుబడిదారులు లాభాలు తీసుకోవడం (ప్రాఫిట్ బుకింగ్) వంటి కారణాల వల్ల ఈ భారీ పతనం చోటుచేసుకుంది.
ఇక భవిష్యత్తులో ధరలు పెరుగుతాయా లేక మరింత తగ్గుతాయా అన్నది గ్లోబల్ పరిస్థితులు, యుద్ధ పరిణామాలు, డాలర్ విలువపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
