War Effect: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న యుద్ధంతో పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇన్నాళ్లూ సురక్షిత ప్రాంతాలుగా పేరుపొందిన కొన్ని దేశాలు కూడా ఇప్పుడు యుద్ధ భయంతో వణికిపోతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా ప్రతిదాడులు ప్రారంభించింది. ముఖ్యంగా అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తున్నట్లు సమాచారం. అలాగే తన చుట్టూ ఉన్న గల్ఫ్ దేశాలపై కూడా ఇరాన్ దాడులు జరుపుతుండటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
ఈ పరిణామాల ప్రభావం దుబాయ్ వంటి ప్రముఖ వ్యాపార కేంద్రాలపై కూడా పడుతోంది. వరుసగా క్షిపణులు, డ్రోన్ దాడుల భయం పెరగడంతో అక్కడ నివసిస్తున్న వ్యాపారులు, పెట్టుబడిదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దుబాయ్లో స్థిరపడిన భారతీయ ధనవంతులు, ఆసియా దేశాలకు చెందిన పెట్టుబడిదారులు తమ ఆస్తుల భద్రతపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ ‘సేఫ్ హెవెన్’గా పేరొందిన దుబాయ్ ప్రతిష్ఠ ఇప్పుడు ఈ ఉద్రిక్తతల కారణంగా దెబ్బతింటోందని విశ్లేషకులు అంటున్నారు.
తాజా నివేదికల ప్రకారం పలువురు పెట్టుబడిదారులు తమ వ్యాపారాలను సింగపూర్, హాంకాంగ్ వంటి ప్రాంతాలకు మళ్లించే ఆలోచనలో ఉన్నారు. యుద్ధ భయం పెరుగుతున్న నేపథ్యంలో గల్ఫ్ దేశాల నుంచి ఇప్పటికే 52,360 మంది భారతీయులు భారత్కు తిరిగి వచ్చినట్లు సమాచారం. వీరిలో చాలామంది ప్రత్యేక విమానాలు లేదా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా స్వదేశానికి చేరుకున్నట్లు కథనాలు చెబుతున్నాయి.
ఇదే సమయంలో కొందరు ధనవంతులు తమ ఆస్తులను కూడా ఇతర దేశాలకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాయిటర్స్ కథనం ప్రకారం దుబాయ్లో నివసిస్తున్న ఇద్దరు భారతీయ పారిశ్రామికవేత్తలు ప్రమాదాన్ని తగ్గించుకునేందుకు తమ బ్యాంకు ఖాతాల నుంచి ఒక్కొక్కరు లక్ష డాలర్లకు పైగా మొత్తాన్ని సింగపూర్కు తరలించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. వీరితో పాటు మరికొందరు సంపన్నులు కూడా తమ ఆర్థిక వ్యవహారాలపై న్యాయ నిపుణులు, ఆర్థిక సలహాదారులను సంప్రదిస్తున్నారని చెబుతున్నారు.
దుబాయ్లో 50 మిలియన్ డాలర్లకు పైగా ఆస్తులు కలిగిన క్లయింట్లు తమ పెట్టుబడులను వెంటనే సింగపూర్, హాంకాంగ్ వంటి ప్రాంతాలకు మార్చాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న అస్థిర పరిస్థితుల కారణంగా ఫ్యామిలీ ఆఫీసులు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటివరకు పన్ను ప్రయోజనాల కోసం దుబాయ్ను ఎంచుకున్న పెట్టుబడిదారులు ఇప్పుడు తమ ప్రాణాలు, ఆస్తుల భద్రతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.
ఒకవేళ యుద్ధం త్వరగా ముగిసినా కూడా విమానాల రాకపోకలు, భద్రతా పరిస్థితులపై పెట్టుబడిదారులకు వెంటనే నమ్మకం కలగడం కష్టం అని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే పెట్టుబడిదారుల విశ్వాసం దెబ్బతినకుండా ఉండేందుకు యూఏఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ, యుద్ధ భయం మాత్రం ఇంకా తగ్గలేదు. దీంతో పలువురు ధనవంతులు తమ వ్యాపారాలను సింగపూర్ వంటి ఇతర దేశాల వైపు మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
