Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ చరిత్రను మార్చి, భవిష్యత్తును కొత్త దిశగా తీసుకెళ్లే పార్టీ ఈ నెల 25న ఆవిర్భవించనుందని ఆమె తెలిపారు. ఆ రోజున అద్భుతమైన ఎజెండాను ప్రకటిస్తామని చెప్పారు. కొత్త ఆలోచనలు, కొత్త రాజకీయాలతో రాష్ట్రాన్ని మార్చి, దేశానికి ఆదర్శంగా నిలిపే లక్ష్యంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు.
గద్వాల నియోజకవర్గానికి చెందిన నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్ తన అనుచరులతో కలిసి తెలంగాణ జాగృతిలో చేరారు. ఈ సందర్భంగా కవిత వారికి కండువా కప్పి పార్టీకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడిన ఆమె, జాగృతి తరపున ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తూ, పోరాడుతూ, పరిష్కారాల కోసం కృషి చేస్తామని తెలిపారు. వెలుగుమట్ల తరహాలో ప్రజల మధ్యే ఉంటూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పారు.
రాజకీయ పరిస్థితులపై స్పందిస్తూ, బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం అచేతన స్థితిలో ఉందని, ప్రజా సమస్యలపై స్పందించడం లేదని విమర్శించారు. గద్వాలలో చేనేత కార్మికులు, పత్తి రైతులు ఇబ్బందులు పడుతున్నా వారి కోసం నిలబడడం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై కూడా విమర్శలు గుప్పిస్తూ, అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర పాలన మొత్తం ఢిల్లీ నుంచే నడుస్తోందని, తెలంగాణ కాంగ్రెస్కు ఏటీఎంగా మారిందని ఆరోపించారు.
ఇక ఎన్నికల విషయానికి వస్తే, ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై పోటీ చేసి జోగులాంబ జిల్లాలో తెలంగాణ జాగృతికి మొదటి విజయం సాధించామని చెప్పారు. భవిష్యత్తులో ఎమ్మెల్యే సీట్లలో మొదటి విజయం గద్వాలలోనే వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గద్వాల కోటపై ఉద్యమకారుల జెండా ఎగరబోతుందనే భావన కలుగుతోందని కవిత అన్నారు.
