Shreyas Iyer: సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో టీమ్ ఇండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ మ్యాచ్ సమయంలో ఫీల్డింగ్ చేస్తూ భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. క్యాచ్ పట్టేటప్పుడు ఆయన బలంగా నేలపై పడటంతో ప్లీహా (Spleen) వద్ద తీవ్రమైన గాయం ఏర్పడింది. వెంటనే అతడిని మైదానం నుండి బయటికి తీసుకెళ్లి, బీసీసీఐ వైద్య బృందం అతడిని ఆసుపత్రికి తరలించింది.
తాజా సమాచారం ప్రకారం, శ్రేయస్కు అంతర్గత రక్తస్రావం కనిపించడంతో అతడిని ఐసీయూలో చేర్చినట్లు తెలుస్తోంది. వైద్యులు అతడి పరిస్థితిని అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు.
క్రికెట్ వర్గాల ప్రకారం:
“శ్రేయస్ అయ్యర్ ప్లీహాకు గాయం అయ్యింది. వైద్య పరీక్షలలో అంతర్గత రక్తస్రావం ఉన్నట్లు తేలింది. అందుకే ఎలాంటి ప్రమాదం లేకుండా వెంటనే ఐసీయూలోకి మార్చాం. కనీసం 2 రోజుల నుంచి 7 రోజుల వరకు అబ్జర్వేషన్లో ఉంచుతాం. రక్తస్రావం ఆగి, ఇన్ఫెక్షన్ లేకుండా ఉంటే తరువాతి చికిత్సపై నిర్ణయం తీసుకుంటాం. శ్రేయస్ బలమైన వ్యక్తి, త్వరలోనే కోలుకుంటాడు” అని తెలిపారు.
బీసీసీఐ కూడా అధికారిక ప్రకటన విడుదల చేసింది. అందులో, ఎడమ పక్కటెముకల దిగువ భాగంలో ప్లీహాకు గాయం కావడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నాం అని పేర్కొంది. అయితే అతడి ఐసీయూలో చేరిన విషయంపై మాత్రం బీసీసీఐ స్పష్టంగా వ్యాఖ్యానించలేదు. కానీ మీడియా వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం అతడు నిజంగానే ఐసీయూలోనే ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, శ్రేయస్ అయ్యర్ కుటుంబం వెంటనే ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు వీసా మంజూరు చేయాలని ఇప్పటికే అభ్యర్థించినట్లు సమాచారం.
ప్రస్తుతం శ్రేయస్ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నప్పటికీ వైద్యులు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. అభిమానులు, టీమ్ సభ్యులు శ్రేయస్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
