Cyclone Montha: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడుతూ “మొంథా” తుపానుగా మారిందని వాతావరణ శాఖ ప్రకటించింది. నైరుతి-ఆగ్నేయ మధ్య బంగాళాఖాత ప్రాంతంలో ఈ తుపాను ప్రస్తుతం కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా గంటకు సుమారు 18 కి.మీ వేగంతో కదులుతోంది. వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం, మంగళవారం ఉదయానికి ఇది తీవ్ర తుపానుగా మరింత బలపడే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఇది విశాఖకు దక్షిణ-ఆగ్నేయంగా 600 కి.మీ, కాకినాడకు ఆగ్నేయంగా 570 కి.మీ, చెన్నైకు తూర్పు-ఆగ్నేయంగా 520 కి.మీ, పోర్టుబ్లెయిర్కు పశ్చిమంగా 750 కి.మీ దూరంలో ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీర ప్రాంతాల్లో గంటకు 50-70 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది.
తుపాను కాకినాడ సమీపంలో మచిలీపట్నం-కాళింగా పట్నం మధ్య తీరం దాటే అవకాశం ఎక్కువగా ఉంది. తీరం దాటే సమయంలో గాలుల వేగం 90 నుండి 110 కి.మీ వరకు చేరుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు.
ప్రభుత్వం ముందస్తు చర్యలు
మొంథా తుపాను ప్రభావం నేపథ్యంలో ప్రభుత్వం అత్యవసర చర్యలను చేపట్టింది:
-
అధికారులకు సెలవులు రద్దు చేసినట్లు ప్రకటించారు.
-
తక్షణ సహాయక చర్యల కోసం ప్రభుత్వం రూ. 19 కోట్లు విడుదల చేసింది.
-
ఎన్డీఆర్ఎఫ్, ఏపీఎసీఎంఏ కేంద్రాలు, అత్యవసర సమాచారానికి 16 శాటిలైట్ ఫోన్లు ఏర్పాటు చేశారు.
-
తీరప్రాంతంలోని 57 మండలాల్లో 219 తుపాను షెల్టర్లు సిద్ధం చేశారు.
-
సముద్రంలో ఉన్న 62 మెకనైజ్డ్ బోట్లను ఒడ్డుకు రప్పిస్తున్నారు.
-
తీర ప్రాంతాల్లో పర్యాటకుల ప్రవేశంపై తాత్కాలిక నిషేధం విధించారు.
విద్యాసంస్థలకు సెలవులు
తుపాను దృష్ట్యా వివిధ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు:
-
అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో ఎల్లుండి వరకు సెలవులు.
-
పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, కడప జిల్లాల్లో రేపటి వరకు సెలవులు.
-
నెల్లూరు జిల్లాలో నేటికి సెలవు ప్రకటించారు.
సహాయక బృందాల మోహరింపు
-
సహాయక చర్యల కోసం 9 ఎన్డీఆర్ఎఫ్, 7 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు విధుల్లోకి వచ్చాయి.
-
టీఆర్-27 నిధులు ఉపయోగించి తాగునీరు, ఆహారం, సహాయ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు.
-
విజయనగరం జిల్లాలోని ముక్కాం తీర గ్రామాన్ని కలెక్టర్ రాంసుందరరెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్ సందర్శించారు మరియు మత్స్యకారులకు సూచనలు అందించారు.
