Crime: పెళ్లి అనేది కేవలం ఇద్దరి వ్యక్తుల కలయిక మాత్రమే కాదు.. అది రెండు మనసుల మధ్య ఉన్న బలమైన బంధం. జీవితాంతం కలిసి ఉండాలని చేసే పవిత్రమైన వాగ్దానం. కానీ ఈ రోజుల్లో బాహ్య సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, నిజమైన అనుబంధాలను పక్కన పెడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. కొందరు క్షణికావేశం, స్వార్థం, అక్రమ సంబంధాల కారణంగా తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఇలాంటి దారుణ ఘటన మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో వెలుగుచూసింది. దేవకృష్ణ (28) అనే వ్యక్తి సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు. ఏప్రిల్ 7న రాత్రి తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో దుండగులు అతడిపై దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటనను మొదట దోపిడీగా చూపించే ప్రయత్నం అతడి భార్య ప్రియాంక పురోహిత్ (25) చేసింది. దొంగలు ఇంట్లోకి వచ్చి తనను కట్టేసి, రూ.3.5 లక్షల విలువైన నగలు దోచుకెళ్లారని, అడ్డుకున్న తన భర్తను చంపేశారని పోలీసులకు తెలిపింది.

అయితే పోలీసుల దర్యాప్తులో అనుమానాస్పద విషయాలు బయటపడ్డాయి. ప్రియాంక చెప్పిన వివరాల్లో పొంతన లేకపోవడంతో పోలీసులు ఆమె కాల్ డేటాను పరిశీలించారు. అప్పుడు కమలేష్ పురోహిత్ అనే వ్యక్తితో ఆమెకు ఉన్న అక్రమ సంబంధం బయటపడింది. గట్టిగా విచారించగా ప్రియాంక నిజం ఒప్పుకుంది. తన భర్త దేవకృష్ణ నల్లగా ఉండటంతో అతనిని ఇష్టపడలేదని, తరచూ అవమానించేదని తెలిపింది.
ప్రియాంక తన ప్రియుడు కమలేష్తో కలిసి జీవించాలనే ఉద్దేశంతో భర్తను అడ్డుగా భావించింది. దీంతో అతడిని హతమార్చాలని పథకం వేసింది. కమలేష్ సహాయంతో సురేంద్ర భాటి అనే వ్యక్తికి రూ.1 లక్షకు సుపారీ ఇచ్చింది. అందులో రూ.50 వేలు ముందుగానే చెల్లించింది. హత్య జరిగిన రాత్రి కావాలనే ఇంటి తలుపులు తెరిచి ఉంచింది. ఆ సమయంలో సురేంద్ర లోపలికి వచ్చి దేవకృష్ణపై కత్తితో దాడి చేసి చంపేశాడు.

దీనిని దోపిడీగా చూపించేందుకు ప్రియాంక ఇంట్లో వస్తువులను చెదరగొట్టింది. నగలను దాచిపెట్టి, తనను తాను కట్టేసుకుని కేకలు వేసింది. అయితే పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది.

మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఘటన స్థలంలో ఆధారాలను సేకరించారు. ప్రియాంక సమాధానాల్లో తేడాలు గమనించి, కాల్ డేటా ఆధారంగా ఆమె పాత్రను గుర్తించారు. చివరికి ఆమెనే ఈ హత్యకు మాస్టర్మైండ్ అని తేల్చారు. ఈ మేరకు ప్రియాంకతో పాటు ఆమె ప్రియుడు కమలేష్ను అరెస్ట్ చేశారు. సుపారీ తీసుకున్న సురేంద్ర భాటి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇక మృతుడి తల్లి తన కుమారుడిని కోల్పోయి తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నిందితులకు కఠిన శిక్ష విధించాలని ఆమె కన్నీరు పెట్టుకుంటూ డిమాండ్ చేస్తున్నారు.
