Shocking: సాధారణంగా పానీపూరీ తింటున్న సమయంలో పానీలో ఎలుక కనిపిస్తే, చాలా మంది వెంటనే తినడం ఆపేసి అక్కడినుంచి వెళ్లిపోతారు. కానీ పంజాబ్లో జరిగిన ఒక ఘటనలో మాత్రం ఓ యువకుడు అందరికంటే భిన్నంగా ప్రవర్తించాడు. పానీ బకెట్లో ఎలుక కనిపించినా కూడా అతడు తినడం ఆపకుండా, పోటీ కొనసాగిస్తూ ఏకంగా 31 పానీపూరీలు తిన్నాడు. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
అమృత్సర్కు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కరణ్ ధంజు తన స్నేహితుడితో ఒక పందెం పెట్టాడు. ఎన్ని పానీపూరీలు తింటే, ఒక్కోటి కోసం 50 రూపాయలు ఇస్తానని చెప్పాడు. దీంతో ఇద్దరూ కలిసి దగ్గరలోని పానీపూరీ బండి వద్దకు వెళ్లారు. పానీపూరీ అమ్మే వ్యక్తి ప్లేట్లో రెండు పానీపూరీలు పెట్టి ధంజు స్నేహితుడికి ఇచ్చాడు. అతడు తింటూ ఉండగా ఊహించని ఘటన చోటుచేసుకుంది.
పానీ ఉన్న బకెట్లో ఒక్కసారిగా ఒక ఎలుక కనిపించింది. ఆ ఎలుక పానీలో పడిపోయి బయటపడేందుకు అటూ ఇటూ తంటాలు పడుతూ కనిపించింది. ఈ విషయం గమనించిన పానీపూరీ విక్రేత ఎంతో కష్టం మీద ఆ ఎలుకను బకెట్ నుంచి బయటకు తీశాడు. కింద పడగానే ఆ ఎలుక వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లిపోయింది.
ఇంత జరిగిన తర్వాత కూడా ధంజు స్నేహితుడు పోటీ ఆపడానికి ఒప్పుకోలేదు. పానీలో ఎలుక పడిందని తెలిసినా కూడా పందెం కొనసాగించి చివరకు మొత్తం 31 పానీపూరీలు తిన్నాడు. ఈ ఘటనను వీడియోగా చిత్రీకరించగా, అది ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, “పానీలో ఎలుక ఉన్నా ఎలా తిన్నాడు?” అని ప్రశ్నిస్తుంటే, మరికొందరు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ సంఘటన నెట్లో పెద్ద చర్చకు దారితీసింది.
