Petrol Shortage: మధ్యప్రాచ్యంలో, ముఖ్యంగా ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా దేశంలో ఇంధన కొరత ఏర్పడవచ్చనే పుకార్లు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపిస్తున్నాయి. ఈ వదంతుల ప్రభావంతో ప్రజలు భయాందోళనకు గురై పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ కడుతున్నారు. కొందరు తమ వాహనాల ట్యాంకులు నింపుకోవడమే కాకుండా, కుక్కర్లు, బకెట్లు, డబ్బాలు, వాటర్ బాటిళ్లు వంటి వస్తువుల్లో కూడా పెట్రోల్ నిల్వ చేసుకుంటున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రత్యేకంగా గుజరాత్ మరియు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వీడియోల్లో, ప్రజలు ఇంట్లో ఉన్న వంట పాత్రలు, డ్రమ్ములు తీసుకువచ్చి పెట్రోల్ నింపుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మండే ద్రవాలను అసురక్షిత పాత్రల్లో నిల్వ చేయడం చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి చర్యలు అగ్ని ప్రమాదాలకు, పేలుళ్లకు దారితీసే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఈ పరిస్థితిపై తెలంగాణ ప్రభుత్వం స్పందిస్తూ స్పష్టత ఇచ్చింది. రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని అధికారులు తెలిపారు. రిఫైనరీల నుంచి డిపోల వరకు సరఫరా సజావుగా కొనసాగుతోందని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించడం ప్రజలు ఒక్కసారిగా అధికంగా కొనుగోలు చేయడం వల్లే తాత్కాలికంగా ఏర్పడిన సమస్య అని చెప్పారు. ఇది నిజమైన కొరత కాదని స్పష్టం చేశారు.
అదేవిధంగా పుకార్లు వ్యాప్తి చేసే వారిపై, అలాగే పెట్రోల్ను బ్లాక్ మార్కెట్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రజలు ఇలాంటి వదంతులను నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
ఇక BPCL, HPCL, IOCL వంటి ప్రధాన ఆయిల్ కంపెనీలు కూడా స్పందించాయి. దేశవ్యాప్తంగా సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, కనీసం 60 నుంచి 70 రోజుల పాటు ఎలాంటి అంతరాయం లేకుండా సరఫరా చేసే సామర్థ్యం ఉందని వెల్లడించాయి.
యుద్ధ ప్రభావంతో ముడి చమురు ధరల్లో కొంత మార్పు రావచ్చు కానీ, సరఫరా పూర్తిగా నిలిచిపోతుందనే పరిస్థితి ప్రస్తుతం లేదని స్పష్టం చేశారు. కాబట్టి ప్రజలు భయపడి అవసరానికి మించి పెట్రోల్ నిల్వ చేసుకోవడం వల్ల ప్రమాదాలకు గురయ్యే అవకాశమేకాకుండా, ఇతరులకు కూడా ఇబ్బందులు కలిగిస్తారని అధికారులు హెచ్చరిస్తున్నారు.
