Rohit Sharma: 2026 టీ20 ప్రపంచకప్లో భారత్–పాకిస్తాన్ మధ్య జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్ ముగిసింది. సంప్రదాయ ప్రత్యర్థిపై టీమిండియా మరోసారి ఆధిపత్యం చాటుతూ ఏకపక్షంగా విజయం సాధించింది. 176 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ జట్టును భారత బౌలర్లు చక్కగా కట్టడి చేసి 114 పరుగులకే ఆలౌట్ చేశారు.
రోహిత్ శర్మ–వసీమ్ అక్రమ్ కలయికపై చర్చ
మ్యాచ్కు ముందు కొలంబోకు వచ్చిన మాజీ భారత కెప్టెన్ రోహిత్ శర్మ, పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్ను హత్తుకుని పలకరించాడు. ఐసీసీ ప్రీ-మ్యాచ్ షోలో సంజనా గణేశన్ సమక్షంలో ఇద్దరూ స్నేహపూర్వకంగా మాట్లాడారు. భారత్–పాకిస్తాన్ జట్ల మధ్య ప్రస్తుతం ‘నో హ్యాండ్షేక్’ విధానం అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ హ్యాండ్షేక్, ఆలింగనం వివాదాస్పదమైంది.
గత ఏడాది ఆసియా కప్ సమయంలో జరిగిన పహల్గాం ఉగ్రదాడి తర్వాత సంఘీభావంగా భారత్ చేతులు కలపడం నిలిపివేసింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, ఐసీసీకి పలుమార్లు ఈ విధానం మార్చాలని కోరినా ఇప్పటివరకు అమలు కాలేదు. అయితే రోహిత్ శర్మ ఐసీసీ బ్రాండ్ అంబాసడర్ కావడంతో అధికారిక కార్యక్రమాల్లో మాజీ ఆటగాళ్లు, బ్రాడ్కాస్టర్లతో ప్రోటోకాల్ ప్రకారం హ్యాండ్షేక్ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీనిపై బీసీసీఐ ఎలాంటి స్పందన ఇస్తుందో అన్న చర్చ మొదలైంది.
మ్యాచ్కు ముందు రోహిత్ శర్మ పాకిస్తాన్ జట్టును ప్రశంసిస్తూ “వారి జట్టులో చాలా మంచి ఆటగాళ్లు ఉన్నారు” అని అన్నాడు. భారత జట్టు క్యాంప్ను కూడా సందర్శించి ఆటగాళ్లకు శుభాకాంక్షలు తెలిపాడు. అలాగే ట్రోఫీని మైదానంలో ప్రదర్శించి, జాతీయ గీతం సమయంలో కూడా మైదానంలో నిలబడి పాల్గొన్నాడు.
మ్యాచ్ వివరాలు
టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా ముందుగా భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. భారత జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. అర్ష్దీప్ సింగ్, సంజూ శాంసన్ స్థానాల్లో కుల్దీప్ యాదవ్, అభిషేక్ శర్మ జట్టులోకి వచ్చారు. అభిషేక్ త్వరగా ఔట్ అయినా భారత్ ధైర్యం కోల్పోలేదు.
ఇషాన్ కిషన్ అద్భుత ఫామ్ కొనసాగిస్తూ పాకిస్తాన్ బౌలర్లపై దాడి చేశాడు. అబ్రార్ అహ్మద్, సైమ్ అయూబ్, షడాబ్ ఖాన్ వంటి స్పిన్నర్లను కూడా ధైర్యంగా ఎదుర్కొని కేవలం 40 బంతుల్లో 77 పరుగులు చేశాడు. అతను క్రీజులో ఉన్నంతసేపు పిచ్ సులభంగా కనిపించింది.
అయితే కిషన్ ఔట్ అయిన తర్వాత పిచ్ స్వభావం మారింది. బంతి టర్న్ అవుతుండటంతో మిగతా బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. మధ్య వరుసలో చిన్నచిన్న భాగస్వామ్యాలతో భారత్ 20 ఓవర్లలో 175/7 స్కోరు చేసింది.
పాకిస్తాన్ చేజ్ విఫలం
లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ మొదటి నుంచే ఒత్తిడిలో పడింది. తొలి ఓవర్లోనే హార్దిక్ పాండ్యా సాహిబ్జాదా ఫర్హాన్ను ఔట్ చేశాడు. తర్వాత జస్ప్రీత్ బుమ్రా వరుసగా సైమ్ అయూబ్, కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా వికెట్లు తీసి మ్యాచ్ను భారత్ వైపు తిప్పాడు. వరుణ్ చక్రవర్తి, అక్సర్ పటేల్ తలో రెండు వికెట్లు పడగొట్టి పాకిస్తాన్ బ్యాటింగ్ను పూర్తిగా కూల్చేశారు. చివరకు పాకిస్తాన్ 114 పరుగులకే ఆలౌట్ అయింది.
Legends Hugs, Kids don’t Shake Hands.. #INDvPAK #T20WorldCup pic.twitter.com/FmfZlF12yA
— Nibraz Ramzan (@nibraz88cricket) February 15, 2026
