Bhogi Pandlu: మకర సంక్రాంతి తెలుగు రాష్ట్రాలలో అత్యంత పెద్ద పండుగగా భావిస్తారు. మూడు రోజులపాటు జరిగే ఈ పండుగను కుటుంబ సభ్యులు కలిసి ఆనందంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. పిల్లలు, యువకులు పతంగులను ఎగురవేస్తూ సంబరాలు చేస్తే, మహిళలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పూజలు, వ్రతాలలో పాల్గొంటూ పండుగను పురస్కరించుకుంటారు. ఇంట్లో ప్రత్యేక పిండి వంటకాలు, నోములు, పూజలు జరిగి ఇంటి వాతావరణం ఉత్సాహంగా మారుతుంది.
సంక్రాంతి పండుగలో భోగి, సంక్రాంతి, కనుమ అనే మూడు ప్రధాన రోజులు ఉంటాయి. మొదటి రోజు వచ్చే భోగి చాలా ప్రత్యేకం. భోగి రోజున ఉదయం భోగి మంటలు వేయడం పురాతన సంప్రదాయంగా కొనసాగుతోంది. పాత పనికిరాని వస్తువులను దహనం చేస్తూ నూతన సంవత్సరాన్ని శుభంగా ఆహ్వానించాలనే భావన దాగి ఉంటుంది.
ఇక భోగి రోజున జరిగే మరో విశేషం ‘భోగి పండ్లు పోసే’ ఆచారం. సాయంత్రం సమయంలో చిన్న పిల్లలపై భోగి పండ్లను పోసి పెద్దలు ఆశీస్సులు అందిస్తారు. ఈ ఆచారం ఆనందం, ఆయురారోగ్యం, శుభఫలితాలను ఇవ్వాలని చేసే ఒక శుభకార్యంగా భావిస్తారు. పిల్లలు కూడా ఎంతో ఆనందంగా పాల్గొంటారు.
ఇక్కడ ‘భోగి పండ్లు’ అనేది కేవలం రేగు పండ్లు మాత్రమే కాదు. రేగు పండ్లతో పాటు చిన్న చెరుకు గడ ముక్కలు, బంతిపూల రెబ్బలు, అక్షతలు, చిల్లర నాణేలు కలిపిన మిశ్రమాన్ని భోగి పండ్లు అంటారు. కొన్నిచోట్ల శనగలు కూడా జోడిస్తారు. పిల్లలపై ఇవన్నీ పోసి, వారు ఆరోగ్యంగా, శుభంగా పెరగాలని ఆశిస్తూ పెద్దలు శుభాకాంక్షలు అందిస్తారు.
