Aditi Myakal: నటుడు శివాజీ గతంలో హీరోయిన్ల డ్రెస్సింగ్పై చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సినీ ఇండస్ట్రీలో పెద్ద వివాదానికి దారితీశాయి. ‘ది రాజా సాబ్’ సినిమా ఈవెంట్ సందర్భంగా నిధి అగర్వాల్ ధరించిన డ్రెస్ అసౌకర్యంగా ఉందని, నటీమణులు పద్దతిగా దుస్తులు ధరించాలంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి.
శివాజీ వ్యాఖ్యలపై మొదటగా సింగర్ చిన్మయి స్పందించగా, ఆ తర్వాత నటి అనసూయ కూడా రంగంలోకి దిగారు. తమ ట్వీట్ల ద్వారా ఆయనపై విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో ఈ విషయంపై పెద్ద స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. కొందరు శివాజీకి మద్దతుగా నిలిస్తే, మరికొందరు హీరోయిన్ల దుస్తుల గురించి వ్యాఖ్యానించడం సరైంది కాదని మండిపడ్డారు. ఈ వివాదం చివరకు తెలంగాణ మహిళా కమిషన్ వరకు వెళ్లింది. అనంతరం శివాజీ మహిళలకు క్షమాపణలు తెలిపారు. దాంతో ఈ వివాదానికి ముగింపు పడిందని అందరూ భావించారు.
అయితే, కొంతకాలానికి మళ్లీ ఈ అంశం తెరపైకి వస్తూనే ఉంది. తాజాగా ‘అమీతుమీ’ నటి అదితి మ్యాకల్ శివాజీ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఆమె మాట్లాడుతూ, శివాజీపై తనకు గౌరవం ఉందని ముందుగా చెప్పారు. ఆయన సినిమాలను తాను చూసానని పేర్కొన్నారు. అయితే గతంలో ఆయన నటించిన చిత్రాల్లో కూడా పలువురు నటీమణులు బోల్డ్గా దుస్తులు ధరించారని గుర్తు చేశారు. మరి అప్పట్లో ఎందుకు ఆ విషయంపై వ్యాఖ్యలు చేయలేదని ప్రశ్నించారు.
“ఈ దుస్తులే నాకు జీవనోపాధి కల్పిస్తున్నాయి” అని అదితి పేర్కొన్నారు. తాను బికినీ వేసుకుని బయట తిరగలేనని స్పష్టం చేశారు. అలాగే గతంలో ‘అమీతుమీ’ సినిమా ప్రమోషన్ సమయంలో బస్సులో ప్రయాణిస్తుండగా ఒక వ్యక్తి అద్దం లోపల నుంచి చేయి దూర్చి అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పారు. ఆ సంఘటన తనకు షాక్ ఇచ్చిందని, ఆ సమయంలో ఎలా స్పందించాలో తెలియక భయపడ్డానని వివరించారు.
అమ్మాయిలను దుస్తుల ఆధారంగా జడ్జ్ చేయడం మానేయాలని అదితి విజ్ఞప్తి చేశారు. తాము ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నామని తెలిపారు. కొందరు అనవసరంగా డ్రెస్సింగ్ గురించి సూచనలు చేస్తుంటారని, అలాంటి ఉచిత సలహాలు అవసరం లేదన్నారు. కొంతమంది మహిళలు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని పేర్కొన్నారు.
