Defamation Case: సినీ నటి హన్సిక కుటుంబంలో నెలకొన్న అంతర్గత వివాదం ఇప్పుడు కోర్టు వరకు చేరింది. తనపై, తన కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేసి ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తూ, హన్సిక తన వదిన నాన్సీ జేమ్స్పై రూ.2 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఈ ఘటన ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీ భార్య అయిన నాన్సీ జేమ్స్ గతంలో సోషల్ మీడియాలో తమ అత్తగారి కుటుంబంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తాను గృహహింసకు, మానసిక వేధింపులకు గురయ్యానని పలుమార్లు వీడియోలు, పోస్టుల ద్వారా వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద సంచలనానికి దారితీశాయి.
అయితే ఈ ఆరోపణలను హన్సిక పూర్తిగా ఖండించారు. నాన్సీ కేవలం డబ్బు వసూలు చేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తోందని కోర్టులో తెలిపారు. తమ కుటుంబం స్టార్ ఇమేజ్ను ఉపయోగించుకుని అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇంతకాలం ఈ విషయంపై మౌనంగా ఉన్నానని, కానీ పరిస్థితులు హద్దులు దాటడంతో న్యాయపోరాటం చేయాల్సి వచ్చిందని హన్సిక పేర్కొన్నారు.
నాన్సీ సోషల్ మీడియాలో చేసిన వీడియోలు, వ్యాఖ్యలు తన తల్లి గౌరవాన్ని దెబ్బతీశాయని, కుటుంబం మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోందని హన్సిక ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు నాన్సీ జేమ్స్కు ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసింది. హన్సిక కుటుంబంపై అవమానకర వ్యాఖ్యలు చేయవద్దని, ఇప్పటికే సోషల్ మీడియాలో పెట్టిన వివాదాస్పద వీడియోలను వెంటనే తొలగించాలని ఆదేశించింది.
ఈ వివాదంలో హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీ కూడా తన సోదరికి మద్దతుగా నిలిచారు. తన భార్య చేసిన ఆరోపణల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. పెళ్లి తర్వాత కొంతకాలానికే తమ మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయని, అవి ఇప్పుడు కుటుంబ స్థాయికి పెరిగాయని తెలుస్తోంది.
హన్సిక తరపు న్యాయవాదులు ఈ వ్యవహారాన్ని వ్యక్తిగత కక్షలు లేదా వ్యాపార ప్రయోజనాల కోణంలో చూస్తున్నారు. నాన్సీ కావాలనే ఈ వివాదాన్ని పెద్దదిగా మారుస్తోందని వారు వాదిస్తున్నారు. ఇక కోర్టు తుది తీర్పు వచ్చే వరకు ఈ కేసు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది. హన్సిక కోరిన రూ.2 కోట్ల పరిహారం, అలాగే భవిష్యత్తులో నాన్సీ చేసే వ్యాఖ్యలపై కోర్టు తీసుకునే నిర్ణయం కీలకంగా మారనుంది.
