Dhurandhar 2: రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2: ది రివెంజ్’ ఉగాది సందర్భంగా థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచిన ఈ చిత్రం ఇప్పటికే పలు రికార్డులను బద్దలు కొట్టి కొత్త రికార్డులు సృష్టిస్తోంది. మూడో వారంలోనూ మంచి వసూళ్లతో ముందుకు దూసుకెళ్తోంది.
అయితే సినిమా విజయంతో పాటు వివాదాలు కూడా వెంటాడుతున్నాయి. ఇప్పటికే కథ కాపీ వివాదం కొనసాగుతుండగా, తాజాగా ఈ సినిమాలోని ఒక పాటపై మరో వివాదం తలెత్తింది. ప్రముఖ నిర్మాణ సంస్థ త్రిమూర్తి ఫిల్మ్స్ కోర్టును ఆశ్రయించడం ఈ అంశాన్ని హాట్ టాపిక్గా మార్చింది.
‘ధురంధర్’ మరియు ‘ధురంధర్ 2’ సినిమాల పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. యూట్యూబ్లో మిలియన్ల వ్యూస్తో ట్రెండ్ అవుతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ శాశ్వత్ సచ్దేవ్ రూపొందించిన రీమిక్స్ పాటలు ప్రత్యేకంగా ప్రేక్షకుల్ని ఆకర్షించాయి. అందులో ‘హమ్ ప్యార్ కర్నే వాలే’ పాట ఎంతో వైరల్ అయింది.
అయితే ఈ పాట అసలు 1989లో విడుదలైన సన్నీ డియోల్, మాధురీ దీక్షిత్ నటించిన ‘త్రిదేవ్’ సినిమాలోని క్లాసిక్ సాంగ్. ఈ పాటకు సంబంధించిన ఆడియో హక్కులు తమవద్ద ఉన్నాయని త్రిమూర్తి ఫిల్మ్స్ పేర్కొంది. ‘ధురంధర్ 2’ మేకర్స్ తమ అనుమతి లేకుండా ఈ పాటను రీమిక్స్ చేసి సినిమాలో ఉపయోగించారని ఆరోపించింది. ఈ పాటను సినిమా నుంచి తొలగించాలన్నా, లేకపోతే నష్టపరిహారం చెల్లించాలన్నా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై దర్శకుడు ఆదిత్య ధర్ మరియు B62 స్టూడియోస్ సమాధానం ఇవ్వాలని కోరింది.
ఇదిలా ఉండగా, ఈ సినిమాపై మరో వివాదం కూడా కొనసాగుతోంది. ‘ధురంధర్ 2’ కథ తనదే అని దర్శకుడు సంతోష్ కుమార్ ఆరోపిస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తదుపరి విచారణ ఏప్రిల్ 16న జరగనుంది. అప్పటివరకు ఆదిత్య ధర్పై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సంతోష్ కుమార్కు కోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.
ఈ పరిస్థితుల్లో కథ వివాదం కొనసాగుతుండగానే, ఇప్పుడు పాట హక్కులపై మరో కేసు రావడంతో ‘ధురంధర్ 2’ మరింత చర్చనీయాంశంగా మారింది.
