Udaan Yatri Cafe: విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. విమానాశ్రయాల్లో అధిక ధరలకు చెక్ పెట్టేందుకు ప్రారంభించిన “ఉడాన్ యాత్రి కేఫ్”లను దేశవ్యాప్తంగా మరింత విస్తరించింది. తక్కువ ధరల్లో నాణ్యమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో ఈ కేఫ్లు ఏర్పాటు చేయబడిన సంగతి తెలిసిందే. తాజాగా మరో 11 విమానాశ్రయాల్లో ఈ సేవలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వర్చువల్గా ప్రారంభించారు.
ఈ కేఫ్లలో టీ, కాఫీ, సమోసా, వాటర్ బాటిల్ వంటి పదార్థాలు కేవలం రూ.10 నుంచే లభించడం ప్రత్యేకత. సాధారణంగా విమానాశ్రయాల్లో ధరలు ఎక్కువగా ఉండే నేపథ్యంలో ఇది ప్రయాణికులకు పెద్ద ఉపశమనంగా మారింది. రాజ్కోట్ విమానాశ్రయం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి, దేశంలోని 57 విమానాశ్రయాల్లో కొత్త సదుపాయాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.
కొత్తగా ప్రారంభమైన ఉడాన్ యాత్రి కేఫ్లు లక్నో, పాట్నా, రాజ్కోట్, జమ్మూ, శ్రీనగర్, జైపూర్, ఇండోర్ వంటి ప్రధాన నగరాల్లో ఉన్నాయి. ఈ కేఫ్లతో పాటు డిజి యాత్ర సేవలు, ఉచిత వైఫై, ‘ఫ్లైబ్రరీ’ (ఉచిత గ్రంథాలయం), పిల్లల కోసం ‘కిడ్స్ జోన్’ వంటి సౌకర్యాలు కూడా ప్రారంభించారు. అలాగే స్థానిక స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు ప్రోత్సాహం ఇవ్వడానికి ‘అవ్సార్ (AVSAR)’ ఔట్లెట్లు ఏర్పాటు చేశారు.
ఈ కేఫ్లలో ధరలు చాలా అందుబాటులో ఉంటాయి. టీ, వాటర్ బాటిల్ రూ.10, కాఫీ, స్నాక్స్, స్వీట్ ఆఫ్ ది డే రూ.20కు లభిస్తాయి. ప్రత్యేకంగా ఆయా ప్రాంతాల స్థానిక వంటకాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉదాహరణకు పుణేలో వడా పావ్, చెన్నైలో వడై, కోయంబత్తూరులో మెదు వడ వంటి స్థానిక రుచులు అందుబాటులో ఉంటాయి. అయితే సమోసా అన్ని కేఫ్లలో సాధారణంగా లభిస్తుంది.
ఇప్పటికే కోల్కతా, చెన్నై, పుణే, విజయవాడ, ఇటానగర్, భువనేశ్వర్, సూరత్, అహ్మదాబాద్, ముంబై, మంగళూరు, తిరువనంతపురం, కోయంబత్తూరు విమానాశ్రయాల్లో ఈ కేఫ్లు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు మరిన్ని ప్రాంతాల్లో ప్రారంభించడంతో ఇంకా ఎక్కువ మంది ప్రయాణికులు ఈ సేవలను వినియోగించుకోగలుగుతున్నారు.
