Telangana: ములుగు జిల్లా జేడీ మల్లంపల్లి గ్రామానికి చెందిన మౌనిక చిన్నప్పటి నుంచే కష్టాల మధ్య జీవితాన్ని గడిపింది. తల్లి సరోజ కూలీ పనులు చేస్తూ, తండ్రి సమ్మయ్య చిన్న పంక్చర్ షాపు నడిపిస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఆర్థిక ఇబ్బందులు ఎంత కఠినంగా ఉన్నా, కూతురి చదువులో మాత్రం ఎప్పుడూ రాజీ పడలేదు. తల్లిదండ్రుల త్యాగాలు, కలలు చూసిన మౌనిక చిన్నప్పుడే ఒక సంకల్పం చేసుకుంది – ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి వారికి గర్వకారణం కావాలని.
2020లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఆమె పూర్తిగా ఉద్యోగ సాధనపై దృష్టి సారించింది. కోచింగ్ సెంటర్లకు వెళ్లే సదుపాయం లేకపోవడంతో ఇంట్లోనే స్వయంగా సిద్ధమైంది. గ్రూప్-1 పరీక్ష కోసం రోజుకు 12 గంటలకుపైగా చదివి, క్రమం తప్పకుండా టెస్ట్ పేపర్లు రాసి తన తప్పులను సరిచేసుకుంటూ ముందుకు సాగింది. ఎంత కష్టాలు ఎదురైనా లక్ష్యం మాత్రం వదల్లేదు.
ఆ పట్టుదల ఫలించింది. ఇటీవల విడుదలైన గ్రూప్-1 ఫలితాల్లో మౌనిక 315వ ర్యాంక్ సాధించింది. ఈ ర్యాంక్ ద్వారా ఆమె డీఎస్పీగా ఎంపికైంది. ఒకప్పుడు చెమటోడ్చి నడిపిన పంక్చర్ షాపు ముందు, ఈరోజు డీఎస్పీగా నిలబడ్డ కూతురి విజయాన్ని చూసి తల్లిదండ్రుల కళ్లలో ఆనందభాష్పాలు రాలాయి.
మౌనిక విజయం కేవలం వ్యక్తిగత గెలుపే కాదు, అనేక పేద, మధ్యతరగతి కుటుంబాల యువతకు స్ఫూర్తి. శ్రమ, క్రమశిక్షణ ఉంటే ఎవరికైనా విజయమే సొంతమవుతుందని ఆమె తన జీవితంతో నిరూపించింది. గ్రామమంతా ఆమెను అభినందిస్తూ “ఇంటి గర్వకారణం”గా పొగడ్తలు కురిపిస్తే, తల్లిదండ్రులు ఆనందంతో మురిసిపోతున్నారు.
