Crime: విజయవాడలో గురువారం జరిగిన ఓ దారుణ హత్య ఘటన స్థానికులను షాక్కు గురిచేసింది. మధ్యాహ్నం సమయంలో అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి కత్తితో తన భార్యపై దాడి చేసి చంపేశాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారిని “ముందుకొస్తే చంపేస్తా” అంటూ బెదిరించడంతో ఎవ్వరూ జోక్యం చేసుకోలేకపోయారు.
దుర్గా అగ్రహారానికి చెందిన దీపాల విజయ్ (40) 2022లో నూజివీడుకు చెందిన మట్టకొయ్య సరస్వతిని (30) ప్రేమించి వివాహం చేసుకున్నాడు. భవానీపురంలో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో విజయ్ టెక్నీషియన్గా, సూర్యారావుపేటలో సరస్వతి నర్సుగా పనిచేస్తోంది. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. దాంపత్య జీవితం లో కలిగిన విభేదాల కారణంగా ఏడాదిన్నరగా ఇద్దరూ విడిగా ఉంటున్నారు. ప్రతిరోజూ సరస్వతి నూజివీడు నుండి ఆసుపత్రికి రాకపోకలు చేసేది.
గురువారం కూడా ఆమె ఉదయం 8 గంటలకు విధులకు హాజరై, మధ్యాహ్నం 2 గంటల వరకు పని చేసింది. సుమారు 2.15 ప్రాంతంలో విధులు ముగించుకుని కుమారుడితో ఆసుపత్రి బయటకు వచ్చిన సరస్వతిపై, అక్కడే మాటు వేసి కూర్చున్న విజయ్ ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. ఆమె మెడ, గొంతు భాగాలను పొడవడంతో సరస్వతి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.
సంఘటనను చూసిన ప్రజలు ఆపడానికి ప్రయత్నించగా, విజయ్ వారిపైనే కత్తి చూపిస్తూ హెచ్చరించాడు. రక్తపు మడుగులో పడిపోయిన భార్య ప్రాణాలు వదిలేవరకు అతడు కత్తితో అక్కడే నిలబడి ఉన్నాడు.
ఈ సమయంలో సూర్యారావుపేట సీఐ అహ్మద్ అలీ మరియు పోలీసులు అక్కడికి చేరుకొని విజయ్ను చాకచక్యంగా చుట్టుముట్టి, స్థానికుల సాయంతో కత్తిని లాగేసి అరెస్టు చేశారు. మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
వివాహం తర్వాత సరస్వతిని అనవసర అనుమానాలతో వేధించేవాడని, దీనితో ఆమె నూజివీడులో భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
