Accident: సౌదీ అరేబియాలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులను తీసుకెళ్తున్న బస్సును ఒక డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో మంటలు చెలరేగి, మొత్తం 42 మంది సజీవదహనమయ్యారు. ఈ ఘటనలో మరణించిన వారు ఎక్కువరు భారతీయులేననీ, వారిలో చాలామంది హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వారని సమాచారం అందుతోంది.
మక్కా యాత్రను ముగించుకుని యాత్రికులు మదీనా వైపు ప్రయాణిస్తుండగా, సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. ఢీకొన్న వెంటనే మంటలు వేగంగా బస్సు మొత్తానికి వ్యాపించడంతో, ఆ సమయంలో నిద్రలో ఉన్న ప్రయాణికులు బయటపడలేక భారీగా ప్రాణనష్టం జరిగిందని తెలుస్తోంది. మరణించిన వారిలో 20 మంది మహిళలు, 11 మంది పిల్లలు ఉన్నారని ప్రాథమిక సమాచారం చెబుతోంది.
ఘటనాస్థలంలో రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటివరకు మృతదేహాల గుర్తింపు పూర్తిగా జరగలేదని అధికారులు తెలియజేశారు. ఈ ప్రమాదం నుంచి ఒక వ్యక్తి మాత్రమే బయటపడినట్లు సమాచారం.
ఈ ఘటనపై భారత ప్రభుత్వ నుంచి స్పష్టమైన సమాచారం ఇంకా రాలేదని, అయితే మధ్యాహ్నం వరకు వివరాలు వచ్చే అవకాశమున్నట్లు హజ్ కమిటీ ప్రతినిధి చెప్పారు. ప్రమాదంలో తెలంగాణ, హైదరాబాద్కు చెందిన వారు ఉంటే, వారు ఏ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా యాత్రకు వెళ్లారు అన్నదాని పై విచారణ జరుగుతోందని తెలిపారు.
