Ayesha Meera Case : బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు అధికారికంగా ముగిసింది. దాదాపు 17 ఏళ్లుగా ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసులో అసలు నిందితుడు ఎవరో తేలకపోవడంతో, సీబీఐ సమర్పించిన క్లోజ్ రిపోర్ట్ ఆధారంగా విజయవాడలోని సీబీఐ ప్రత్యేక కోర్టు కేసును మూసివేసింది. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అన్నపూర్ణ శుక్రవారం ఈ మేరకు తుది ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు దోషి తేలకుండానే ముగిసింది.
2007 డిసెంబర్ 27న కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని మహిళల హాస్టల్లో ఆయేషా మీరా దారుణంగా హత్యకు గురైంది. ఈ కేసులో స్థానిక పోలీసులు సత్యంబాబును అరెస్టు చేశారు. అనంతరం విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు అతనికి శిక్ష విధించింది. అయితే 2017లో హైకోర్టు సత్యంబాబు నిర్దోషి అని ప్రకటించి, అతడిని అన్యాయంగా ఇరికించారని పేర్కొంటూ విడుదల చేసింది. అసలు నేరస్థులను గుర్తించాలని ఆదేశించింది.
దీంతో ప్రభుత్వం ప్రత్యేక సిట్ను ఏర్పాటు చేసింది. సిట్ దాదాపు 11 నెలల పాటు దర్యాప్తు చేసినప్పటికీ, కీలక సాక్ష్యాలు దిగువ కోర్టులో ధ్వంసమయ్యాయని హైకోర్టుకు నివేదించింది. సిట్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు 2019లో కేసును సీబీఐకి అప్పగించింది.
హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ గత ఆరేళ్లుగా కేసును లోతుగా పరిశీలించింది. మృతదేహ అవశేషాలను వెలికితీసి గాంధీ ఆసుపత్రి వైద్యులతో రెండోసారి పోస్టుమార్టం కూడా నిర్వహించింది. గతంలో విచారణ చేసిన పోలీసు అధికారులను సైతం ప్రశ్నించింది. అయితే 2007లో జరిగిన ఈ హత్యకు సంబంధించి కొత్తగా ఎలాంటి స్పష్టమైన సాక్ష్యాలు లభించలేదని సీబీఐ తన తుది నివేదికలో పేర్కొంది. శాస్త్రీయంగా కొత్త ఆధారాలు సేకరించడం సాధ్యపడలేదని స్పష్టం చేసింది.
ఈ సుదీర్ఘ న్యాయపోరాటంలో ఆయేషా తల్లి శంషాద్బేగం నిరంతరం న్యాయం కోసం పోరాడారు. చివరకు సీబీఐ కూడా నిందితులను గుర్తించలేకపోవడంతో తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. సీబీఐ క్లోజ్ రిపోర్ట్పై తాము ఎలాంటి ప్రొటెస్ట్ పిటిషన్ లేదా ప్రైవేట్ కేసు వేయబోమని కోర్టుకు తెలిపారు. దీంతో కేసును అధికారికంగా మూసివేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు.
ఇక రీ పోస్టుమార్టం కోసం భద్రపరిచిన ఆయేషా శరీర అవశేషాలను తమకు అప్పగించాలని తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఫిబ్రవరి 27 ఉదయం 10 గంటలకు కోర్టు ప్రాంగణంలో గుర్తింపు పంచనామా నిర్వహించిన తర్వాత అవశేషాలను అప్పగించాలని న్యాయస్థానం ఆదేశించింది. ప్రభుత్వ భద్రతతో అవశేషాలను తెనాలికి తరలించి, కుటుంబ మతాచార ప్రకారం గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు సహకరించాలని అధికారులకు సూచించింది. మొత్తం ప్రక్రియను వీడియో చిత్రీకరించాలని కూడా కోర్టు స్పష్టం చేసింది.
2007లో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసు దోషి తేలకుండానే ముగిసిన నేపథ్యంలో, తాజాగా ఆమె శరీర అవశేషాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. సీబీఐ దర్యాప్తు పూర్తి చేసి కేసును క్లోజ్ చేసిన తరువాత కోర్టు ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ చేపట్టారు. విజయవాడ కోర్టు ప్రాంగణంలో తల్లిదండ్రులు షంషాద్ బేగం, ఇక్బాల్లకు అవశేషాలను అధికారికంగా అందజేశారు.
అక్కడి నుంచి అవశేషాలను సొంతూరు తెనాలికి తీసుకువెళ్లారు. ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం, ముస్లిం మత పెద్దల సమక్షంలో ముస్లిం శ్మశాన వాటికలో ఖననం చేశారు. కార్యక్రమం భావోద్వేగ వాతావరణంలో జరిగింది. ప్రజా సంఘాల నాయకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై “జోహార్ ఆయేషా మీరా.. వి వాంట్ జస్టిస్” అంటూ నినాదాలు చేశారు.
అవశేషాల ఖననం
ఈ కేసు సీబీఐ దర్యాప్తులోకి వెళ్లిన తరువాత 2019లో రీ-పోస్టుమార్టం కోసం సమాధి నుంచి శరీర భాగాలను వెలికితీశారు. అయితే అనంతర దర్యాప్తులో కొత్తగా పరిశీలించాల్సిన అంశాలు లేవని సీబీఐ తేల్చి కేసును మూసివేసింది. దీంతో అవశేషాలను కుటుంబానికి అప్పగించాలని కోర్టు ఆదేశించింది.
ఖననం అనంతరం అయేషా తండ్రి ఇక్బాల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హత్య జరిగిన రోజు రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 4 గంటల మధ్య ఏమి జరిగిందో పూర్తిగా వెలుగులోకి రావాలని డిమాండ్ చేశారు. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో జ్యుడిషియల్ ఎంక్వైరీ నిర్వహించాలని కోరారు. అప్పటి దర్యాప్తు అధికారులపై, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 27ను ఆయేషా మీరా సంస్మరణ దినంగా ప్రకటించాలని, ఆమె పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద బాలికల విద్యకు సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
18 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నప్పటికీ ఫలితం రాలేదని ముస్లిం మత పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ వ్యవస్థ ఎందుకు నిర్లక్ష్యం చూపిందని ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి పూర్తి స్థాయి న్యాయం జరగాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. ఖననం కార్యక్రమం ముగిసినప్పటికీ, ఆయేషా మీరా కేసులో పూర్తి నిజాలు బయటపడాలనే డిమాండ్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.
