Bihar Elections: ఒక్కసారే గెలిచి.. 20 ఏళ్లు సీఎంగా!

Why Nitish Kumar, despite serving as longest Bihar CM in history, never contested in Bihar polls?

Why Nitish Kumar, despite serving as longest Bihar CM in history, never contested in Bihar polls?

Bihar Elections: నీతీశ్‌కుమార్‌పై ప్రతిపక్షం ఎప్పటిలాగే విమర్శలు చేసింది. వయసు ప్రభావంతో బ్యాలెన్స్‌ కోల్పోతున్నారనీ, అధికారం కోసం ఎవరితోనైనా చేతులు కలుపుతారనీ, ‘పల్టూరామ్’ అని కటువుగా విమర్శించారు. కానీ ఆయన అనుచరుల దృష్టిలో మాత్రం నీతీశ్ ఓ ప్రగాఢమైన రాజకీయవేత్త. పరిస్థితులు ఎలా మారుతున్నాయో చదివే రాజకీయ మేధస్సు ఆయనకుందనీ అంటారు. ముఖ్యంగా ‘సుశాసన్ బాబూ’గా ఆయనకున్న క్లీన్ ఇమేజ్ ఇప్పటికీ నిలకడగానే ఉన్నదనడానికి బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే సాక్ష్యం. ప్రభుత్వ వ్యతిరేకత కంటే ఆయన ఇమేజ్ ఎక్కువ పనిచేసి, జేడీయూ–ఎన్డీఏ కూటమి గతం కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంది.

ఈ ఎన్నికల్లో మరోసారి నీతీశ్ నేతృత్వంలోని ఎన్డీఏకు ఘనవిజయం లభించింది. అవినీతి మరకలేమీ లేని నాయకుడిగా బిహార్ ప్రజలు మళ్లీ ఆయనపై నమ్మకం ఉంచి అధికారం అప్పగించారు. రాష్ట్రాన్ని అత్యంతకాలం పాలించిన ముఖ్యమంత్రిగా తన రికార్డును మరింతగా బలపరచుకునేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఎందుకు ఆయనను రాజకీయ చాణక్యుడు అంటారో ఈ ఫలితాలే నిరూపించాయి.

రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది?
1951లో పట్నా సమీపంలోని భక్తియార్పుర్‌లో నీతీశ్ కుమార్ జన్మించారు. తండ్రి రామ్లఖన్ సింగ్ స్వాతంత్ర్య సమరయోధుడు, ఆయుర్వేద వైద్యుడు. తల్లి పరమేశ్వరి గృహిణి. నీతీశ్‌ బిహార్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి రాష్ట్ర విద్యుత్ బోర్డులో పనిచేశారు. కానీ రాజకీయాలపై ఆసక్తి కారణంగా ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లో ప్రాపంచిక ప్రయాణం ప్రారంభించారు.

విద్యార్థి దశలోనే జయప్రకాశ్‌ నారాయణ్ ఉద్యమంలో పాల్గొన్నారు. అప్పుడు లాలూ ప్రసాద్‌ యాదవ్, సుశీల్‌ మోదీ వంటి నేతలతో సన్నిహిత పరిచయాలు ఏర్పడ్డాయి. 1977, 1980, 1985లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి 1985లోనే మొదటిసారి అసెంబ్లీలోకి ప్రవేశించారు. తర్వాత జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టి 1989 నుంచి 2004 వరకూ ఆరు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.

ఆ కాలంలోనే రైల్వే, వ్యవసాయం శాఖలలో సహాయ మంత్రి బాధ్యతలు నిర్వహిస్తూ ఇంటర్నెట్ టికెట్ బుకింగ్, తత్కాల్ పద్ధతి, రిజర్వేషన్ కౌంటర్ల ఆధునీకరణ వంటి కీలక నిర్ణయాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. 1999లో బెంగాల్ రైలు ప్రమాదం తర్వాత మంత్రి పదవికి రాజీనామా చేసి రాజకీయ నైతికతను చాటుకున్నారు.

2000లో కేవలం వారం రోజులు మాత్రమే సీఎంగా పని చేసి తిరిగి కేంద్ర రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చారు. 2004లో ఎన్డీఏ పరాజయం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లోకి మళ్లీ వచ్చి కీలక మార్పులకు నాంది పలికారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయరు?
1985 తర్వాత నీతీశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నేరుగా పోటీ చేయలేదు. శాసన మండలి మార్గం ద్వారా పదవులను చేపట్టారు. ఒకే నియోజకవర్గంపై కాకుండా మొత్తం రాష్ట్రంపై దృష్టి పెట్టడం కోసమే ఈ నిర్ణయం అన్న విషయాన్ని పలు సందర్భాల్లో తెలిపారు.

2005లో ఆర్జేడీ ప్రభుత్వంపై వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎన్డీఏను అధికారంలోకి తెచ్చారు. ‘జంగల్ రాజ్’ ఇమేజ్ నుండి బిహార్‌ను బయటకు తేవడానికి నేరాన్ని అణిచివేసి, సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టి పరిపాలనలో మార్పులు తెచ్చారు. కుటుంబ సభ్యులను రాజకీయాల నుంచి దూరంగా ఉంచి అవినీతి ఆరోపణలకు అవకాశం ఇవ్వలేదు. ఆయన కొడుకు పేరు కూడా చాలామందికి తెలియదంటే ఆయన క్లీన్ ఇమేజ్ అర్థమవుతుంది.

మహాదళితులు, అత్యంత వెనుకబడిన వర్గాల కోసం ప్రత్యేక వర్గాలు సృష్టించి ఆర్జేడీ ఓటు బ్యాంకుకు పెద్ద దెబ్బతీశారు.

ఎన్డీఏతో దాగుడుమూతలు
మోదీ రాజకీయాల్లోకి రాకతో బిహార్ రాజకీయాల దిశే మారిపోయింది. ప్రారంభంలో మోదీ–నీతీశ్ మధ్య సంబంధాలు అంత అనుకూలంగా లేకపోయాయి. 2010లో మోదీతో కలిసి ప్రచారం చేయడానికి కూడా ఆయన ఆసక్తి చూపలేదు. 2014 ఎన్నికల్లో ఎన్డీఏ భారీ విజయం సాధించిన తర్వాత తన బాధ్యతను స్వీకరించి సీఎం పదవికి రాజీనామా చేయడం ఆయన ప్రత్యేకత.

2015లో ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసి విజయాన్ని సాధించినా, ఆ తర్వాత మళ్లీ ఎన్డీఏలో చేరడం, 2022 తర్వాత మళ్లీ ఆర్జేడీ వైపు వెళ్లడం, 2024 ఎన్నికల ముందు మళ్లీ ఎన్డీఏలోకి రావడం—నీతీశ్‌ని ‘పల్టూరామ్’ అని పిలవడానికి ఇదే ప్రధాన కారణం.

అయినప్పటికీ ఆయన ఇమేజ్, సామాజిక సమీకరణాలపై దృష్టి భాజపాకు కూడా అవసరమై, సీఎం అభ్యర్థిగా ప్రకటించకపోయినా ఆయన నాయకత్వంలోనే బిహార్ ఎన్నికల్లోకి వెళ్తున్నట్లు మోదీ–అమిత్ షా వెల్లడించారు.

Also Read: SSMB29: మహేశ్- రాజమౌళి మూవీ నుంచి ఇవాళ బిగ్ అప్డేట్

Bihar Elections: ఒక్కసారే గెలిచి.. 20 ఏళ్లు సీఎంగా!