Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీమ్ ఇండియా టీ20 ప్రపంచకప్ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో ధోనీ, రోహిత్ శర్మ తర్వాత టీ20 ప్రపంచకప్ గెలిపించిన మూడో భారత కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన తొలి మెగా టోర్నీలోనే జట్టును విజేతగా నిలిపి, మహేంద్ర సింగ్ ధోనీ సరసన చోటు సంపాదించాడు.
టోర్నీ మొత్తం సూర్య నాయకత్వం, జట్టు ప్రదర్శనపై అభిమానులు ప్రశంసలు కురిపించారు. అయితే ప్రపంచకప్ ముగిసిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ రిటైర్మెంట్ ప్రకటించవచ్చని సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు వినిపించాయి. టోర్నీ పూర్తయ్యాక క్రికెట్కు వీడ్కోలు చెప్పనున్నాడనే వార్తలు కూడా ప్రచారం అయ్యాయి.
ఈ నేపథ్యంలో టైటిల్ గెలిచిన తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్తో కలిసి మాట్లాడాడు. ఈ సందర్భంగా ఒక విలేకరి ఆయనను రిటైర్మెంట్ గురించి ప్రశ్నించాడు.
దానికి స్పందించిన సూర్యకుమార్ యాదవ్ ఆ వార్తలను ఖండించాడు. ప్రస్తుతం అలాంటి ఆలోచనలేమీ లేవని స్పష్టం చేశాడు. “అంతా బాగానే ఉంది కదా… ఇప్పుడే రిటైర్మెంట్ గురించి ఎందుకు ఆలోచించాలి?” అంటూ ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు.
ఈ వ్యాఖ్యలతో తన రిటైర్మెంట్పై వస్తున్న ప్రచారానికి సూర్యకుమార్ యాదవ్ చెక్ పెట్టాడు. ప్రస్తుతం తన దృష్టి జట్టుతో కలిసి మరిన్ని విజయాలు సాధించడంపైనే ఉందని సంకేతాలు ఇచ్చాడు.
