Crime: చెన్నైలోని అన్నా విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఓ విద్యార్థిని తనకు జరిగిన లైంగిక వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న ఈ విద్యార్థిని గురువారం పోలీసు కమిషనర్ కార్యాలయాన్ని ఆశ్రయించి, తన సమస్యను వివరించింది.
ఆమె ఫిర్యాదు ప్రకారం, కళాశాలలో పనిచేస్తున్న ఒక ప్రొఫెసర్ మొదట తన కుటుంబ పరిస్థితులు తెలుసుకుని సహాయం చేస్తానని ముందుకు వచ్చాడని తెలిపింది. తండ్రిలా భావించి నమ్మకం కల్పించిన అతను, తర్వాత తనపై అనుచితంగా ప్రవర్తించడం ప్రారంభించాడని ఆరోపించింది. గత మూడేళ్లుగా ప్రత్యక్షంగా మరియు ఫోన్ ద్వారా కూడా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని వెల్లడించింది. అంతేకాకుండా, తన స్నేహితురాళ్లలో కొందరిని కూడా ఇదే విధంగా ఇబ్బంది పెడుతున్నాడని ఆమె పేర్కొంది.
ఈ విషయంపై ఇప్పటికే విశ్వవిద్యాలయ అధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్లు చెప్పిన విద్యార్థిని, తన ఫిర్యాదుపై తక్షణమే దర్యాప్తు జరిపి సంబంధిత ప్రొఫెసర్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ ఫిర్యాదును గమనించిన పోలీసు కమిషనర్, అభిరామపురం ఆల్ ఉమెన్ పోలీసులకు వెంటనే దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో కేసు విచారణ కొనసాగుతోంది.
ఇదే సమయంలో, ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు విశ్వవిద్యాలయం వద్ద ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ జ్ఞానవేల్ర్బాబు పై యూనివర్సిటీ అధికారులు సస్పెన్షన్ విధించారు. అనంతరం ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయనను తిరునెల్వేలిలో అరెస్ట్ చేసింది.
ఈ ఘటన విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతపై మరొకసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది.
