IND vs PAK: భారత్–పాకిస్థాన్ మధ్య జరగనున్న హై వోల్టేజ్ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీ20 వరల్డ్ కప్-2026లో భాగంగా ఈ మ్యాచ్ ఆదివారం సాయంత్రం 7 గంటలకు కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో ప్రారంభం కావాల్సి ఉంది. భారత్, శ్రీలంక ఒకే టైమ్ జోన్లో ఉండటంతో మన దేశంలో కూడా ఇదే సమయానికి ప్రత్యక్ష ప్రసారం జరగనుంది. అయితే మ్యాచ్పై వర్షం ప్రభావం ఉండొచ్చని వాతావరణ నివేదికలు సూచిస్తున్నాయి.
మ్యాచ్ ప్రారంభ సమయానికి కొలంబోలో ఆకాశం మేఘావృతంగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల టాస్ లేదా ఆట ప్రారంభం కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశముందని తెలుస్తోంది. బీబీసీ వెదర్ సమాచారం ప్రకారం మొదట సాయంత్రం భారీ వర్షం పడుతుందని అంచనా వేశారు. కానీ తాజా అప్డేట్స్ కొంత ఊరటనిస్తున్నాయి. సాయంత్రం 6 గంటల సమయంలో 51 శాతం ఉన్న వర్షం అవకాశాలు, 7 గంటలకు సుమారు 40 శాతానికి తగ్గి, రాత్రి 8:30 ప్రాంతానికి 27 శాతానికి పడిపోవచ్చని చెబుతున్నారు. అంటే మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే పరిస్థితి తక్కువే అయినా, మధ్యలో కొద్దిసేపు ఆట నిలిచిపోవడం లేదా ఓవర్లు తగ్గించే పరిస్థితి ఉండొచ్చు.
వర్షం కారణంగా ఆలస్యమైతే డక్వర్త్-లూయిస్ విధానం అమలు చేస్తారు. ఫలితం రావాలంటే కనీసం రెండు జట్లు ఐదేసి ఓవర్లు అయినా ఆడాలి. ప్రేమదాస స్టేడియంలో డ్రైనేజీ వ్యవస్థ చాలా మెరుగ్గా ఉండటంతో వర్షం ఆగిన వెంటనే మైదానాన్ని త్వరగా సిద్ధం చేసే అవకాశం ఉంది. ఇది అభిమానులకు మంచి వార్తగా చెప్పొచ్చు.
కొలంబో వాతావరణం త్వరగా మారే స్వభావం కలిగి ఉండటంతో చివరి నిమిషంలో పరిస్థితులు మారే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం మ్యాచ్కు కొంత అంతరాయం వచ్చినా, ఫలితం మాత్రం తేలే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే జట్టులో కొన్ని కీలక మార్పులతో ఆందోళనలో ఉన్న అభిమానులకు, మ్యాచ్ పూర్తిగా రద్దైతే నిరాశే. అయితే రాత్రి 9 గంటల తర్వాత వర్షం తగ్గి ఆకాశం క్లియర్ అయ్యే అవకాశాలు ఉండటంతో పూర్తి మ్యాచ్ చూసే ఛాన్స్ కూడా ఉంది.
